ముంబై: నేపాల్ భూకంపం అటు సామాన్యులతో పాటు, ప్రముఖలను కూడా బలిదీసుకుంది. గతంలో బీసీసీఐకి ఫిజియోథెరపీ కన్సల్టెంట్గా వ్యవహరించిన డాక్టర్ విపుల్ చావ్దా (39) నేపాల్ లో సంభవించిన భూకంపంలో దుర్మరణం పాలయ్యారు. నేపాల్లోని లాంగ్తాంగ్ వ్యాలీలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఆయన భూకంపానికి బలయ్యారు. ఆయనతో పాటు ట్రెక్కింగ్కు వెళ్లిన వారు సురక్షిత ప్రాంతానికి చేరుకోగా, ఆయన మృతదేహాన్ని ఇంకా కనుగొనలేకపోయారు.
డాక్టర్ విపుల్ చావ్దా 2001 నుంచి 2006 వరకు ముంబై రంజీ జట్టుకు ఫిజియోగా వ్యవహరించిన ఆయన బీసీసీఐ తరుపున కన్సల్టెంట్గా కూడా వ్యవహరించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన నేపాల్లోని లాంగ్తాంగ్ వ్యాలీలో ట్రెక్కింగ్ చేసేందుకు గాను ఏప్రిల్ 19న ఆయన ఖాఠ్మండుకు వెళ్లారు.

సాహసాలంటే బాగా ఇష్టపడే విపుల్ చావ్దా అంతక ముందు మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపుని కూడా అధిరోహించారు. అంతేకాదు దక్షణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన పలు కొండలపై కూడా ట్రెక్కింగ్ చేశారు. విపుల్ చావ్దా మృతిపై ఆయన సోదరుడు డాక్టర్ కేతన్ చావ్దా మాట్లాడుతూ ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో భూకంపం సంభవించిందని, విపుల్ అక్కడికక్కడే చనిపోయినట్టు అతని సహచరులు చెప్పారని వెల్లడించారు.
పర్వతం నుంచి పెద్ద బండరాళ్లు దొర్లకుంటూ వచ్చాయని, వాటిలో ఒకటి విపుల్ చావ్దా మరణానికి కారణమని తెలిసిందని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హెలికాప్టర్ల ద్వారా ఖాఠ్మండులోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ హర్షద రాజ్యాధ్యక్షను ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ఇతను విపుల్ చావ్దా సహచరులలో ఒకడని తెలిపారు.