టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా - సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ సప్న గిల్ గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. పృథ్వీ షాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ సప్న గిల్ మరోసారి కోర్టు మెట్లెక్కింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ముంబై కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేసింది.
పృథ్వీషాపై సప్న చేసిన వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, జూన్ 19వ తేదీలోపు విచారణ నివేదిక సమర్పించాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. మరోవైపు ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు పోలీసులపై చర్యలు తీసుకోవాలని సప్న చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చారు. అసలేం జరిగిందంటే..

గతేడాది ఫిబ్రవరిలో ఓ హోటల్లో పృథ్వీ షా- సప్న గిల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పృథ్వీషాతో సెల్ఫీ కోసం సప్న స్నేహితులు ప్రయత్నించడంతో గొడవ మొదలైంది. తొలుత ఒకరికి సెల్పీ ఇచ్చిన పృథ్వీ షా, తర్వాత మిగిలిన వారికి నో చెప్పాడు. దీంతో సప్న ఫ్రెండ్స్ క్రికెటర్ను ఇబ్బంది పెట్టారు. మరోవైపు దీన్ని గమనించిన హోటల్ సిబ్బంది సప్న గ్రూప్ను బయటకు పంపారు.
అంతటిలో ఆ గొడవ ముగియలేదు. పృథ్వీ షా వెళ్తున్న కారును సప్న గ్రూప్ వెంబడించింది. అంతేగాక పృథ్వీపై వాళ్లు దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో నెట్టింట వైరల్గా మారాయి. దీనిపై కేసును నమోదు చేసిన ముంబై పోలీసులు సప్న గిల్ను అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించారు. అనంతరం బెయిల్పై బయటకు వచ్చిన సప్న పృథ్వీషాపై కేసు పెట్టింది. ఐపీసీ 354, 509, 324 సెక్షన్ల కింద కంప్లైంట్ చేసింది.
కాగా, పృథ్వీ షా ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన ఈ ఓపెనర్ మిగిలిన మ్యాచ్ల్లో తుదిజట్టులో కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో 43 పరుగులు చేశాడు. నిన్న కేకేఆర్లో జరిగిన మ్యాచ్లో ఏడు బంతుల్లో పది పరుగులు చేసి ఔటయ్యాడు.