
ఓపెనింగ్ చేస్తా:
ముంబై కోచ్ మహేలా జయవర్ధనే, కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు. 'గతేడాది లానే ఐపీఎల్ 2020 ఎడిషన్లో కూడా నేనే ఓపెనింగ్ చేస్తా. అయితే జట్టు యొక్క అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. క్వింటన్ డికాక్ మంచి భాగస్వామి. అతడు త్వరగా పరుగులు రాబడతాడు' అని రోహిత్ చెప్పాడు. గత ఏడాది టోర్నమెంట్లో రోహిత్ 15 మ్యాచ్ల్లో 28.93 సగటుతో 405 పరుగులు చేసాడు.

ఐపీఎల్ అంటే బౌండరీలే కాదు:
'ఐపీఎల్ అంటే ఒక పెద్ద పండగ. భారత్లోని క్రికెట్ అభిమానులంతా ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో మాకు తెలుసు. వారికోసం తప్పకుండా బాగా ఆడాలి. టోర్నీ అంతా సజావుగా జరగాలని నేను కోరుకుంటున్నా' అని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఐపీఎల్ అంటే కేవలం బౌండరీలే కాదని, ఆట మీద అన్ని రకాలుగా పట్టు సాధించడమన్నాడు. మీ జట్టులో మీకు ఇష్టమైన స్పిన్నర్ ఎవరని అడగ్గా.. ఒక కెప్టెన్గా అందరు ఆటగాళ్లను సమానంగా చూడాల్సిన బాధ్యత నాపై ఉంది. జట్టులో ప్రతి ఒక్కరూ నాకు ఇష్టమైన వాళ్లే అన్నాడు.

మలింగకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి:
'దుబాయ్ పిచ్లను అర్థం చేసుకోవడమే అసలైన సవాల్. ఈసారి రివర్స్ స్వింగ్ కీలకంగా మారుతుందనుకుంటున్నా. అందుకు తగ్గట్టుగానే మా జట్టులో నాణ్యమైన పేస్ బౌలర్లు ఉన్నారు. లసిత్ మలింగ జట్టుకు అందుబాటులో లేడు. అతను ముంబై జట్టుకు అందించిన విజయాలను మర్చిపోలేం. మలింగ స్థానంలో కౌల్టర్నైల్, ధవల్ కులకర్ణి, మోసిన్లలో ఎవరో ఒకర్ని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాం. ఇక్కడ 2018లో ఆసియాకప్ ఆడాం. పిచ్ పరిస్థితులను ఇంకా అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో మా జట్టు సమతూకంగా ఉంది' అని రోహిత్ చెప్పాడు.

హోరాహోరీ తప్పదు:
'కరోనా వైరస్ విషయంలో జట్టు మొత్తం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడున్నా సరే ప్రతీక్షణం జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకు తగ్గ ప్రణాళికలు కూడా వేసుకున్నాం. ఇక చెన్నై విషయానికొస్తే.. అదో గొప్ప జట్టు. ఎప్పటిలాగే ఈసారి కూడా మా మధ్య హోరాహోరీ తప్పదు. అయితే ప్రత్యర్థి జట్టును చూసి అంచనాకు రాలేం. ఆ విషయంలో మేం సమయం వృథా చేయాలనుకోవట్లేదు. మా పని పూర్తి చేయడమే మా ముందున్న లక్ష్యం' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












