
నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో చెన్నై బౌలర్ ముఖేష్ చౌదరి సంచలన ప్రదర్శన చేశాడు. అసలు ఈ మ్యాచ్కు ముందు అతను చెన్నై ప్లేయింగ్ 11లో ఉంటాడో ఉండడో అనే సందేహాలు కలిగాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు అతని ప్రదర్శన అంత బాలేదు. ఇక తుదిజట్టులో అతని పేరు కన్పించేసరికి అభిమానులు కొంత ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ చెన్నై టీం ఈ పేసర్పై నమ్మకముంచి ఈ మ్యాచ్లో కొనసాగించింది. 25ఏళ్ల ముఖేష్ చౌదరి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుబెట్టుకుంటూ ముంబైతో మ్యాచ్లో బౌలింగ్లో నిప్పులు చెరిగాడు. మ్యాచ్కు ముందు కొత్త బంతిని అందుకున్న ముఖేష్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌలింగ్ వేశాడు.
తొలి ఓవర్లోనే ముంబై ఇండియన్స్ ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లను డకౌట్ చేసి ముంబైని కోలుకోలేని దెబ్బకొట్టాడు. తర్వాత 3వ ఓవర్ వేసిన ముఖేష్ చౌదరి ఆ ఓవర్లోనూ ముంబైకి షాకిచ్చాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఆ ఓవర్లో ప్రమాదకర డెవిన్ బ్రెవిస్ను ఔట్ చేసి ముంబైని కష్టాల్లోకి నెట్టాడు. ఈ మ్యాచ్లో 3ఓవర్లు వేసిన ముఖేష్ చౌదరి 3/19ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ధోనీ అండతో చెన్నై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ముఖేష్ చౌదరి ఎంపికయ్యాడు.

కేవలం పవర్ ప్లేలో మాత్రమే బౌలింగ్ వేయడానికి ఇష్టపడతావా అని హర్ష బోగ్లే ఆడగగా.. 'అలా ఏం కాదు.. ఎప్పుడైనా బౌలింగ్ చేయగలను. పవర్ ప్లేలో బాగా బౌలింగ్ చేయడానికి నాకు మా జట్టులో ఎలాంటి ఒత్తిడి అయితే లేదు. నా చుట్టూ అనుభవశీలురైన ప్లేయర్లు ఉన్నారు. ధోనీ, బ్రావో, జడ్డూ లాంటి వారు నాకు మద్దతు తెలపడంతో నా ఒత్తిడి అంతా ఆటోమేటిక్గా దూరమవుతుంది.' అని పేర్కొన్నాడు. చెన్నై స్టార్ ప్లేయర్ దీపక్ చాహర్ దూరం కావడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేలా ముఖేష్ యాదవ్ రాణిస్తుండడం చెన్నైకి శుభపరిణామం.