
మరికొన్ని రోజుల్లో క్రికెట్ పండుగ ఐపీఎల్ 16వ సీజన్ మొదలవనుంది. ఇలాంటి సమయంలో మరో రెండు జట్లకు గట్టి షాక్ తగిలింది. ఆ రెండు జట్లకు కీలకంగా మారిన యువ పేసర్లు ఇద్దరు గాయాలతో ఈ సీజన్కు దూరమయ్యేలా ఉన్నారు. వారిలో చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ ముఖేష్ చౌదరి ఒకడు. మరొక పేసర్ కూడా గతేడాది అందరి దృష్టినీ ఆకర్షించిన వాడే. అతనే లక్నో సూపర్ జెయింట్స్ ఎడం చేతి వాటం పేసర్ మొహ్సిన్ ఖాన్.
గతేడాది డిసెంబరులో విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున ముఖేష్ ఆడాడు. ఆ తర్వాత వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో రంజీ ట్రోఫీ ఆడే ముందు అతనికి కనీసం వారం రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు సలహా ఇచ్చారు. కానీ వారం రెస్ట్ తర్వాత కూడా అతను కోలుకోలేదు. ఈ క్రమంలోనే పూర్తిగా రంజీ ట్రోఫీకి దూరం అవ్వాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆటకు దూరమైన ముఖేష్ పరిస్థితిపై క్లారిటీ లేదని సీఎస్కే యాజమాన్యం చెప్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. 'మేం ముఖేష్ కోసం వెయిట్ చేస్తున్నాం కానీ పెద్దగా మాక్కూడా ఆశలు లేవు. గతేడాది మా ప్రధాన బౌలర్లలో ముఖేష్ ఒకడు. అతను ఈ ఏడాది ఆడకపోవడం చాలా దురదృష్టకరం' అని పేర్కొన్నాడు. గతేడాది 13 మ్యాచులు ఆడిన ముఖేష్ 16 వికెట్లతో రాణించాడు. దీపక్ చాహర్ లేని లోటును తీర్చాడు. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ కూడా ఈ సీజన్ ఆడేలా కనిపించడం లేదు.
గతేడాది భుజం నొప్పితో ఆటకు దూరమైన మొహ్సిన్ ఖాన్కు శస్త్రచికిత్స అవసరమైంది. లేదంటే అసలు గతేడాది టీమిండియా నుంచి కూడా అతనికి పిలుపు రావలసింది. కానీ భుజం గాయంతో ఆడలేదు. గతేడాది 9 మ్యాచులు ఆడిన మొహ్సిన్ ఖాన్ 14 వికెట్లతో రాణించాడు. పవర్ప్లేలో బౌలింగ్ చేసినా కూడా 6 కన్నా తక్కువ ఎకానమీతో ఆకట్టుకున్నాడు. కానీ అతను ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. అతను ఐపీఎల్ ఆడుతున్నాడా? లేదా? అని లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యానికి కూడా ఐడియా లేదని సమాచారం.