కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి.. ప్రస్తుతం ఈ పాట టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి క్రికెట్ ప్రియులకు గట్టిగా వినపడింది. కొడితే సిక్స్, లేదంటే బాదితే బౌండరీ అంటూ కళ్లు చేదిరో షాట్లతో మైదానాన్ని అంతలా హోరెత్తించాడు. 37 బంతుల్లోనే 270.3 స్ట్రైక్ రేట్ తో మెరుపు సెంచరీ చేసిన అతడు.. మొత్తంగా 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది.
ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో భారత తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్ గా నిలిచాడు. టీ20లో భారత్ తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. అలాగే 17 బంతుల్లోనే అర్ధ శతకం బాది వేగవంతమైన ఫిఫ్టీల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇంకా ఓ ఇన్నింగ్స్ లో భారత్ తరఫున అత్యధిక సిక్స్ లు బాదిన క్రికెటర్ గానూ ఘనత సాధించాడు. మొత్తంగా ఈ ఐదు మ్యాచుల సిరీస్ లో అతడు 55.80 యావరేజ్, 219.68 స్ట్రైక్ రేట్ తో 279 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్ధ శతకం, 24 ఫోర్లు, 22 సిక్స్ లు ఉండటం విశేషం.

అయితే అభిషేక్ శర్మ బాదే ప్రతీ షాట్ కు స్టేడియం అంతా అభిమానుల చప్పట్లు, కేరింతలు, ఈలలు, గోలలతో హోరెత్తింది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆమిర్ ఖాన్, రాజీవ్ శుక్లా, ముకేశ్ అంబానీ, రిషి సునాక్, మనోజ్ బదాలే, నారాయణ మూర్తి కూడా.. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ చూసి చప్పట్లతో అభినందించారు. అతడి ధనాధన్ సునామీ ఇన్నింగ్స్ ను బాగా ఆస్వాదించారు. ఈ క్రమంలోనే ముకేశ్ అంబానీ అయితే సీట్ లో నుంచి లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ అభిషేక్ ను అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన నెటిజన్లు.. అంబానీ అభిషేక్ ను ఎత్తుకెళ్లిపోతాడేమోనని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. నీ ప్రదర్శనతో అంబానీనే నిలబెట్టావ్ గా అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
Even Mukesh Ambani saab is standing and clapping for Abhishek Sharma. Madness at Wankhede. pic.twitter.com/TGrQRGjfAN
— R A T N I S H (@LoyalSachinFan) February 2, 2025
నిరాశపరిచిన ఇతర బ్యాటర్లు
నిజానికి ఓ దశలో ఇంగ్లాండ్ కు 290కు పైగా లక్ష్యాన్ని భారత బ్యాటర్లు ఈజీగా నిర్దేశిస్తారని అంతా అనుకున్నారు. కానీ అభిషేక్కు తిలక్ (24), శి వమ్ దూబె (30) తప్ప ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందలేదు. దీంతో 247 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సంజూ శాంసన్ (16), హార్దిక్ పాండ్య (9), రింకూ సింగ్ (9), సూర్య కుమార్ యాదవ్ (2), అందరూ విఫలమయ్యారు. చివర్లో అక్షర్ (15) కూడా నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ 3 వికెట్లు పడగొట్టగా, మార్క్ వుడ్ 2, ఆర్చర్, రషీద్, ఒవర్టన్ తలో వికెట్ దక్కించుకున్నారు.