హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా ఢిల్లీ డేర్డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య ఫిరోజ్ షా కోట్లా వేదికగా సోమవారం మ్యాచ్ జరిగింది. ఇందులో కేవలం నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు పరాజయం పాలైంది. 144 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టు 139 పరుగులకే పరిమితమై మరో ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. కానీ మరో ఎండ్లో శ్రేయస్ అయ్యర్ చివరి వరకూ విజయం కోసం పోరాడాడు. పంజాబ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ తొలి బంతికి ముజీబ్ రెహ్మాన్ అద్భుతమైన డెలివరీతో రిషబ్ పంత్ను ఔట్ చేశాడు.
భారీ ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం ఉన్న పంత్ 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ కావడం మ్యాచ్ను మలుపు తిప్పింది. ముజీబ్ విసిరిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. శ్రేయాస్ అయ్యర్ 45 బంతుల్లో (57)కు రాహుల్ తెవాతియా (24) అండగా ఉన్నప్పటికీ.. చివర్లో ఒత్తిడి పెరగడంతో ఢిల్లీ ఓటమిపాలైంది.
చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన దశలో పంజాబ్ జట్టు ముజీబ్ రెహ్మాన్ బౌలింగ్కు దిగాడు. శ్రేయస్ అయ్యర్ ఓ సిక్స్, ఫోర్ బాదడంతోపాటు రెండు పరుగులు తీయగలిగింది ఢిల్లీ. గెలవాలంటే ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. కానీ శ్రేయస్ భారీ షాట్కు యత్నించి ఔటవడంతో.. పంజాబ్ గెలుపొందింది.