ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన అనంతరం మహా సమరం మొదలుకానుంది. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 2న మొదలుకానున్న ఈ మెగాటోర్నీ అదే నెల 29న ముగుస్తోంది. అయితే ఈ ప్రపంచకప్కు ఎంపికవ్వనున్న భారత జట్టుపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లలో ఉత్కంఠ మొదలైంది.
తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రపంచకప్ జట్టును కొందరు మాజీ క్రికెటర్లు ప్రకటిస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, హర్షా భోగ్లే వంటి మాజీలు తమ ప్రిడిక్షన్ టీమ్ను వెల్లడించారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేరారు. 15 మందితో కూడిన భారత జట్టును వెల్లడించాడు.

ఫామ్లో ఉన్న సంజు శాంసన్కు ఎమ్మెస్కే అవకాశం ఇవ్వలేదు. అలాగే శుభ్మన్ గిల్కు మొండిచేయి చూపించాడు. లక్నో సూపర్ జెయింట్స్ స్పీడ్గన్ మయాంక్ యాదవ్ను సెలక్ట్ చేశాడు. బుమ్రా, సిరాజ్తో పాటు మయాంక్కు పేస్ బాధ్యతలు అప్పగించాడు. వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ను ఎంపిక చేశాడు.
ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శివమ్ దూబె ఉన్నారు. స్పెషలిస్ట్ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ను ఎమ్మెస్కే ప్రసాద్ ఎంపిక చేశాడు. అలాగే స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ను సెలక్ట్ చేశాడు.
టీ20 ప్రపంచకప్కు ఎమ్మెస్కే ఎంపిక చేసిన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శివమ్ దూబె, రింకూ సింగ్, రిషభ్ పంత్, మయాంక్ యాదవ్.