టీమిండియా కోచ్గా ద్రవిడ్ ఉండాలి:
రవిశాస్త్రి తర్వాత హెడ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, మెంటార్గా టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఉంటే బాగుంటుందని ఎంఎస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ మీడియా సమావేశంలో పాల్గొన్న ఎంఎస్కే ప్రసాద్ పలు అంశాలపై స్పందించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత హెడ్ కోచ్గా ఎవరంటే బాగుంటుందని అడగ్గా.. ఏమాత్రం ఆలోచించకుండా ద్రవిడ్ పేరు చెప్పేశాడు. 'రవిశాస్త్రి పదవీకాలం ముగిసిన అనంతరం కోచ్గా రాహుల్ ద్రవిడ్ ఉంటే బాగుంటుంది. ఇక మెంటార్గా ఎంఎస్ ధోనీ ఉండాలి. వీరిద్దరూ భారత జట్టులో భాగంగా ఉంటే చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఎన్నో అద్భుతాలు చేయొచ్చు' అని ఎంఎస్కే ప్రసాద్ అన్నాడు.
కోచ్గా నిరూపించుకున్న ద్రవిడ్:
రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే కోచ్గా నిరూపించుకున్నాడు. 'ది వాల్' శిక్షణలోనే 2018లో భారత్ అండర్-19 ప్రపంచకప్ని సాధించింది. ఇండియా-ఏ జట్టుకు కూడా కోచ్గా వ్యవహరించి అనేక విజయాలు అందించాడు. ఇక నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్గా ఉండి కుర్రాళ్లను సరైన దారిలో నడిపించాడు. ఇక ఈ ఏడాది జులైలో శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంకలో పర్యటించింది. అప్పుడు కూడా ద్రవిడే కోచ్గా వ్యవహరించాడు. ద్రవిడ్ కోచింగ్లో ఎంతోమంది యువ క్రికెటర్లు భారత జట్టుకు ఆడుతున్నారు. అందుకే అందరూ ద్రవిడే కోచ్గా రావాలని కోరుకుంటున్నారు.
కానుక ఇవ్వాలని:
యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి 2021 టీ20 ప్రపంచకప్ 2021 ప్రారంభం కానుంది. అక్టోబరు 24న పాకిస్థాన్తో భారత్ తొలి మ్యాచ్ని ఆడనుంది. ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇప్పటికే ఎంఎస్ ధోనీని మెంటార్గా నియమించిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ అనంతరం టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ అనంతరం కోచ్గా రవిశాస్త్రి పదవీకాలం కూడా ముగుస్తుండటంతో టీ20 ప్రపంచకప్ని గెలిచి వీరిద్దరికి కానుకగా ఇవ్వాలని భారత బృందం భావిస్తోంది. జట్టుతో పాటు మహీ ఉంటాడు కాబట్టి అద్భుతాలు జరుగుతాయనే అందరూ ఆశిస్తున్నారు.
ధోనీ ఎంపిక సరైందే:
'టీ20 ప్రపంచకప్ కోసం ఎంఎస్ ధోనీని మెంటార్గా ఎంపిక చేసి బీసీసీఐ మంచి పని చేసింది. బీసీసీఐ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఈ నిర్ణయం బీసీసీఐ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్, టీమిండియా కలిసే తీసుకుని ఉంటారు. 200 కంటే ఎక్కువ ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అనుభవం, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నమెంట్లను గెలిచిన అనుభవం ఉన్న ఆటగాడు టీమిండియాకు మెంటార్గా పనిచేయడం ఎంతో కీలకం కానుంది. నేను ఈ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. చాలా సంతోషంగా ఉంది. టీమిండియాకు మెంటర్గా పనిచేయడానికి ధోనీ కంటే మెరుగైన వ్యక్తి మరొకరు ఉండరు' అని ఎంఎస్కే అన్నాడు.