హైదరాబాద్: కరోనా వైరస్ వల్ల ఈ ఏడాది బీసీసీఐకి నష్టం వచ్చినా.. దాని ప్రభావం భారత క్రికెట్పై ఉండదు అని భారత సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ నిలిచిపోవడం బాధాకరమని పేర్కొన్నాడు. కొత్త చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషిని బీసీసీఐ ఎంపిక చేయడంతో ఎమ్మెస్కే ప్రసాద్ పదవీ కాలం గత మార్చిలో ముగిసింది. ఎమ్మెస్కే భారత్ తరపున 6 టెస్టులు 17 వన్డేలు ఆడాడు.
'అభిమానుల ఆరోగ్యం ముఖ్యం.. ఖాళీ స్టేడియాల్లో ఆడేందుకు సిద్ధం'
ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్లను నిర్వహించాలన్న ప్రతిపాదనను ఎమ్మెస్కే ప్రసాద్ స్వాగతించాడు. తాజాగా ఎమ్మెస్కే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ప్రతిఒక్క ఆటగాడు ప్రేక్షకుల మధ్య సత్తా చాటాలనుకుంటాడు. కానీ కఠిన సమయంలో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తే.. ప్రమాదకర కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఖాళీ మైదానాల్లో మ్యాచ్లను నిర్వహించాలనుకోవడం మంచి ఆలోచన. ఎందుకంటే టీవీల్లో కోట్ల మంది చూస్తారు' అని పేర్కొన్నాడు.
'కరోనా వైరస్ వల్ల ఈ ఏడాది బీసీసీఐకి నష్టం వచ్చినా.. దాని ప్రభావం భారత క్రికెట్పై ఉండదు. బీసీసీఐ బోర్డు వద్ద నిధులు బాగానే ఉన్నాయి. నాలుగైదేళ్లుగా తీరికలేని క్రికెట్ ఆడుతున్న సీనియర్లకు ఈ విరామం వరం లాంటిదే. అయితే ఐపీఎల్లో సత్తాచాటి భారత జట్టులోకి రావాలనుకునే వారికి మాత్రం నిరాశ కలిగించే అంశం. విరామం ఆటగాళ్ల ఫిట్నెస్పై ప్రభావం చూపదు. ఎందుకంటే.. ఆటగాళ్లకు ఇల్లలో అత్యాధునిక జిమ్లు ఉన్నాయి. బీసీసీఐ ట్రెయినర్ ఆన్లైన్లో వాళ్లను పర్యవేక్షిస్తున్నాడు' అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భవితవ్యంపై చాలా స్పష్టంగా ఉన్నాడని, ఈ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడని గతంలో ఎమ్మెస్కే చెప్పాడు. 'ఎంఎస్ ధోనీ భవిష్యత్పై చాలా స్పష్టతతో ఉన్నాడు. ఆ విషయాన్ని నాతో పాటు జట్టు యాజమాన్యంతోనూ చెప్పాడు. దాన్ని రహస్యంగా ఉంచాలి కాబట్టి చెప్పలేకపోతున్నా. మా మధ్య జరిగిన సంభాషణ చాలా బాగా జరిగింది. అయితే అది మా మధ్యే ఉండిపోతుంది' అని ఎమ్మెస్కే అన్నారు. తన పదవీకాలంలో భారత జట్టుకు విలువైన క్రికెటర్లను అందించాన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్ వంటి యువకులు వెలుగులోకి వచ్చారని చెప్పుకొచ్చాడు.