
ధోనీ భవిష్యత్ ఏంటో నాతో చెప్పాడు:
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మెన్గా ఇటీవలే ఎమ్మెస్కే ప్రసాద్ పదవి కాలం ముగిసింది. తాజాగా సీఏసీ బృందం బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్గా సునీల్ జోషిని ఎంపికయిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. 'ఎంఎస్ ధోనీ భవిష్యత్పై చాలా స్పష్టతతో ఉన్నాడు. ఆ విషయాన్ని నాతో పాటు జట్టు యాజమాన్యంతోనూ చెప్పాడు. దాన్ని రహస్యంగా ఉంచాలి కాబట్టి చెప్పలేకపోతున్నా. మా మధ్య జరిగిన సంభాషణ చాలా బాగా జరిగింది. అయితే అది మా మధ్యే ఉండిపోతుంది' అని ఎమ్మెస్కే అన్నారు.

జట్టుకు విలువైన క్రికెటర్లను అందించా:
'నా పదవీ కాలంలో భారత జట్టుకు విలువైన క్రికెటర్లను అందించాను. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్ వంటి యువకులు వెలుగులోకి వచ్చారు. ఒక్కోసారి ఆటగాళ్ల విషయంలో కొన్ని కఠిన పరిస్థితులను సైతం ఎదుర్కొన్నా. అందరూ బాగా ఆడుతున్నప్పుడు ఎంపిక చాలా కష్టంగా ఉండేది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లను పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పించడం నాకు సవాలుగా మారింది' అని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నారు.

అదే నాకు సంతృప్తినిచ్చే విషయం:
'ఎంఎస్ ధోనీ నుంచి విరాట్ కోహ్లీ వరకు ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్లను చూసే భాగ్యం నాకు దక్కింది. ఎప్పుడైతే ధోనీ కెప్టెన్గా బాధ్యతల నుంచి తప్పుకున్నారో మళ్లీ అలాంటి సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి కోసం చూశాం. అయితే కోహ్లీ ఆ స్థానంను భర్తీ చేయగలిగాడు. కోహ్లీ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాక టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అది కూడా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో భారత్ నిలిచింది. అదే నాకు సంతృప్తినిచ్చే విషయం' అని ఎమ్మెస్కే చెప్పారు.

నాల్గవ బ్యాట్స్మెన్ లేక కాదు:
'ధోనీ తన భవిష్యత్తుపై స్పష్టత వ్యక్తం చేయడంతోనే మరొకరిని ఎంపిక చేయాల్సి వచ్చింది. భారత్లో నాల్గవ బ్యాట్స్మెన్ లేనందునే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందన్న విమర్శలపై నేను ఏకీభవించను. గ్రూప్లో టాపర్గా భారత్ నిలిచిందంటే అది జట్టు సమిష్టి కృషి వల్లే సాధ్యం అయింది. అంతేకాని నాల్గవ బ్యాట్స్మెన్ లేక కాదు' అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












