
హైదరాబాద్: యో-యో టెస్టులో పాసైనా వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరగబోయే వన్డే సిరిస్లో టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలకు బీసీసీఐ ప్రకటించిన 17 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కని సంగతి తెలిసిందే. వీరిద్దరూ యో-యో టెస్టులో పాసైనట్లు ప్రకటించడంతో సఫారీ పర్యటనలో చోటు దక్కించుకుంటారని అభిమానులు భావించారు.
అయితే, బీసీసీఐ శనివారం ప్రకటించిన జట్టులో వీరికి చోటు దక్కలేదు. దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. 'రైనా మంచి బ్యాట్స్మెన్ అలాగే మంచి ఫీల్డర్ కూడా. అలాంటిది అతన్ని తీసుకోకుండా కేదార్ జాదవ్ను ఎందుకు ఎంపిక చేశారు. మేము రైనాను బ్లూ జెర్సీలో చూడాలనుకుంటున్నాం, అతనికి అవకాశం ఇవ్వండి' అని నెటిజన్లు ట్వీట్లు చేశారు.
ఇక, యువరాజ్ విషయానికి వస్తే అతడు జట్టులో చోటు దక్కించుకోకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతాడేమో అనే సందేహాన్ని అభిమానులు వ్యక్తం చేశారు. వీటన్నింటిపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఎట్టకేలకు స్పందించారు. యువీ యో-యో టెస్టు పాసైనా ఫిట్నెస్ సమస్యలతో సతమవుతున్నాడని అన్నాడు.
'నిజానికి యువీ యో-యో టెస్టు పాసైనందుకు సంతోషంగా ఉంది. అయితే అతడికి మ్యాచ్లు ఆడిన అనుభవం లేదు. తప్పకుండా అతనికి భవిష్యత్తులో అవకాశం ఇస్తాం. అతన్ని జట్టులో తిరిగి చూస్తారు' అని తెలిపాడు. ఇక రైనా విషయానికి వస్తే పరుగులు సాధించడంలో ఈ మధ్య కాలంలో పూర్తిగా విఫలమయ్యాడని అన్నాడు.
'దేశవాళీ రంజీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన సురేశ్ రైనా మొత్తం సీజన్ ఆడాడు. తాను ఆడిన 12 ఇన్నింగ్స్ల్లో అతడు చేసిన పరుగుల సంఖ్య 105. యావరేజి 11.66గా ఉంది. ఈ టోర్నీలో రైనా వ్యక్తిగత అత్యధిక స్కోరు 33. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకునే రైనాను ఎంపిక చేయలేదు' అని ఎమ్మెస్కే వివరణ ఇచ్చాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.