
మిక్కీమౌజ్ సెలక్షన్ కమిటీ:
2019 ప్రపంచకప్ సమయంలో ఓ మ్యాచ్ చూడటానికి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు ఎమ్మెస్కే ప్రసాద్ 'టీ' సర్వ్ చేస్తూ కనిపించాడు. ఈ ఘటనపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ మనకు మిక్కీ మౌజ్ సెలక్షన్ కమిటీ ఉందంటూ ఎద్దేవా చేశారు. 'టీమిండియాకు మిక్కీమౌజ్ సెలక్షన్ కమిటీ దొరికింది. కోహ్లీ జట్టు ఎంపికపై తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. అతడు ఏది చెపితే సెలక్టర్లు అదే చేస్తున్నారు. సెలక్టర్లకు ఉన్న అర్హతలేంటి?. అంతా కలిపి కనీసం 12 టెస్టులైనా ఆడలేదు. ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్కు వచ్చిన సెలక్టర్లలో ఒకరిని నేను గుర్తుపట్టలేకపోయా. టీమిండియా బ్లేజర్ ధరించడంతో ఎవరని ప్రశ్నించా. సెలక్టరని చెప్పాడు. అందరూ అనుష్కకు టీ కప్పులు అందించారు. దిలీప్ వెంగ్సర్కార్ స్థాయి వ్యక్తులు సెలక్షన్ కమిటీలో ఉండాలి' అని ఫరూక్ అన్నారు.

ఫరూక్ యూటర్న్:
ఫరూఖ్ వ్యాఖ్యలపై అనుష్క కూడా ఘాటుగానే స్పందించారు. 'విమర్శలు చేసేవారు చాలాసార్లు నా గురించి తప్పుగానే చెబుతున్నారు. ఇదే మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూ ఉంది. అర్థం లేని అబద్ధాలతో కూడిన విమర్శలకు, కామెంట్లకు స్పందించడం ఇష్టం లేకే ఇంతకాలం మౌనంగా ఉన్నా. ప్రపంచకప్ మ్యాచ్లో సెలక్టర్లు నాకు టీ అందించారనడం చెడు ఉద్దేశంతో చెప్పిన అబద్ధం. టోర్నీలో నేను ఒక్క మ్యాచే చూశాను. అదీ ఫ్యామిలీ బాక్స్లో ఉండి చూశా. సెలెక్టర్ల బాక్స్లో నేను కూర్చోలేదు. మీరు సెలెక్షన్ కమిటీపైనా, వారి అర్హతలపైనా ఏవైనా విమర్శలు చేయాలనుకుంటే చేసుకోండి. అది మీ ఇష్టం. కానీ.. వివాదాల్లోకి నా పేరును లాగొద్దు. దురుద్దేశంతో కూడిన వ్యవహారాల్లో నా పేరును వాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. నన్ను ఇక్కడితో వదిలేయండి' అని పేర్కొన్నారు. ఆపై ఫరూక్ యూటర్న్ తీసుకున్నారు. తాను జోక్ చేశానని, చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూపుతున్నారని ఫరూక్ వివరణ ఇచ్చారు.

అనవసరంగా వివాదంలోకి లాగారు:
ఫరూక్ ఇంజినీర్ గతంలో చేసిన వ్యాఖ్యలను నాటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కొట్టిపారేశారు. తాజాగా ఓ క్రీడాఛానెల్తో మాట్లాడిన ఆయన ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తనదైనశైలిలో స్పందించారు. ఆ వివాదంలో తమ సెలక్టర్లను అనవసరంగా లాగారని పేర్కొన్నారు. 'అనుష్కకు టీ సర్వ్ చేసిన ఘటనలో సెలక్షన్ కమిటీని అనవసరంగా వివాదంలోకి లాగారు. సెలక్షన్ కమిటీలో ఉండటం చాలా కష్టం. ప్లేయర్స్ను ఎంపిక చేయడం, తొలగించడంపై విమర్శలు వస్తాయి. కానీ ఆ టీమ్ సక్సెస్ అయినప్పుడు మాత్రం రావాల్సిన క్రెడిట్ ఇవ్వరు. ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలిచినప్పుడు ఎవరూ సెలక్షన్ కమిటీని మెచ్చుకోలేదు. అయినా మేము పట్టించుకోలేదు. టీమ్ మేనేజ్మెంట్ మా పనిని గుర్తించింది. అది చాలు' అని అన్నారు.

సెలెక్షన్ కమిటి ఛైర్మన్గా నాలుగేళ్లు:
ఆ విషయంలో బయటివాళ్లు ఏమనుకున్నా ఫర్వాలేదని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నారు. తాము ఏం పని చేశామో బోర్డు సభ్యులకు తెలుసని, ముఖ్యంగా టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, పరాస్ మాంబ్రేకు బాగా తెలుసని ఆయన వివరించారు. ఎమ్మెస్కే 2016 నుంచి 2020 వరకు నాలుగేళ్లు టీమిండియా సీనియర్ సెలెక్షన్ కమిటి ఛైర్మన్గా కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతని నేతృత్వంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2018-19 ఆస్ట్రేలియా పర్యటన, 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీలకు భారత జట్టును ఎంపిక చేశారు.


Click it and Unblock the Notifications












