హైదరాబాద్: టీమిండియా క్రికెట్ దిగ్గజం, ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ను భారత జట్టుకు హెడ్ కోచ్గా నియమించడం సరైన నిర్ణయం అని బీసీసీఐ మాజీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ అన్నాడు. బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుందని ఆయన ప్రశంసించాడు. కోచ్గా ద్రవిడ్ సరైన వ్యక్తి అని తాను గతంలోనే చెప్పానని ఎంఎస్కే పేర్కొన్నాడు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత జట్టుకు హెడ్ కోచ్గా ద్రవిడ్ను బీసీసీఐ నియమించింది.
T20 World Cup 2021: రేపటి నుంచే మరో మెగా సమరం.. షెడ్యూల్, పాయింట్లు లాంటి వివరాలు! మ్యాచ్ టై అయితే!
తాజాగా ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ... 'భారత జట్టుకు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ సరైన వ్యక్తి అని నేను గతంలోనే చెప్పాను. ద్రవిడ్ ఆటగాళ్లతో బాగా కలిసిపోతాడు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరితో బాగుంటాడు. రవిశాస్త్రి హయాంలో కూడా భారత జట్టు మెరుగ్గా రాణించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో విజయాలు సాధించడం మామూలు విషయం కాదు. వచ్చే రోజుల్లో ఇలాంటి విజయాలు కావాలంటే.. ద్రవిడ్ జట్టుతో ఉండాల్సిందే. అదే టీమిండియాకు కోచ్గా సరైన వ్యక్తే' అని అన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనుంది. టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజీలాండ్ పర్యటనతో టీమిండియా కోచ్గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా ద్రవిడ్ ఉన్నారు. ఆ బాధ్యతల నుంచి త్వరలోనే తప్పుకొంటాడని, అనంతరం భారత జట్టు పగ్గాలు అందుకుంటాడని తెలుస్తోంది. బౌలింగ్ కోచ్గా పరాస్ మామ్బ్రే ఎంపిక లాంఛనం కానుంది. ఇక బ్యాటింగ్ కోచ్గా ప్రస్తుతం ఉన్న విక్రమ్ రాఠోడ్ అదే పదవిలో కొనసాగనున్నాడు. అయితే ఫీల్డింగ్ కోచ్గా ఆర్ శ్రీధర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లు అండర్-19 స్థాయిలో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోనే మేటి ఆటగాళ్లుగా తయారైన సంగతి తెలిసిందే. కొందరు ప్లేయర్స్ ఇప్పుడు భారత జట్టులోనూ ఆడన్నారు. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తున్న నేపథ్యంలో చాలా మంది ద్రవిడ్నే తర్వాతి కోచ్గా నియమించాలంటూ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ, జై షా అతడిని ఒప్పించారని సమాచారం. మరోవైపు ద్రవిడ్ ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ భారత జట్టు కోచ్గా సేవలందించిన సంగతి తెలిసిందే. గతంలో ఇండియా-ఏ జట్టుకు, శ్రీలంకలో పర్యటించిన టీమిండియాకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరించాడు.