
కెప్టెన్గా కోహ్లీకి చివరి ప్రపంచకప్:
ఐపీఎల్ 2021 ఫైనల్ అక్టోబర్ 15న ముగుస్తుంది. ఆ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా వ్యూహాన్ని సిద్ధంచేసే పనిలో పడతాడు. ఒకవిధంగా మహీ రచించిన వ్యూహాలను విరాట్ కోహ్లీ మైదానంలో అమలు చేయనున్నాడు. టీ20 కెప్టెన్గా కోహ్లీకి ఇది చివరి ప్రపంచకప్. అందుకే కోహ్లీ కచ్చితంగా ఈసారైనా ఐసీసీ ట్రోఫీ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. మూడు ఐసీసీ టైటిళ్లను దక్కించుకున్న కెప్టెన్లలో ఒకడైన మహీ అనుభవం టీమిండియాకు కచ్చితంగా ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలోనే భారత జట్టుపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్, మాజీ ఆటగాడు ఎంఎస్కే ప్రసాద్ స్పందించాడు. ధోనీది మామూలు బుర్ర కాదని పేర్కొన్నాడు. ఈసారి ధోనీ, కోహ్లీ అద్భుతాలు చేస్తారని ఎంఎస్కే ఆశాభావం వ్యక్తం చేశాడు.

బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా:
తాజాగా ఎంఎస్కే ప్రసాద్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్ కోసం ఎంఎస్ ధోనీని మెంటార్గా ఎంపిక చేసి బీసీసీఐ మంచి పని చేసింది. బీసీసీఐ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఈ నిర్ణయం బీసీసీఐ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్, టీమిండియా కలిసే తీసుకుని ఉంటారు. 200 కంటే ఎక్కువ ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అనుభవం, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నమెంట్లను గెలిచిన అనుభవం ఉన్న ఆటగాడు టీమిండియాకు మెంటార్గా పనిచేయడం ఎంతో కీలకం కానుంది. నేను ఈ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. చాలా సంతోషంగా ఉంది. టీమిండియాకు మెంటర్గా పనిచేయడానికి ధోనీ కంటే మెరుగైన వ్యక్తి మరొకరు ఉండరు' అని అన్నాడు.

కోహ్లీ పని తేలికవుతుంది:
ఎంఎస్ ధోనీ, రవిశాస్త్రితో విరాట్ కోహ్లీ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ ముగ్గురికి ఇది గొప్ప టోర్నమెంట్ అవుతుంది. ధోనీ కెప్టెన్సీలో విరాట్ చాలా ఏళ్లు క్రికెట్ ఆడాడు. అదే సమయంలో శాస్త్రితో కోహ్లీ ఎంతో చక్కగా సమన్వయం చేసుకోగలడు. ఇక మహీ ఆలోచనలు ఎంతో పదునుగా ఉంటాయి. అతడికి క్రికెట్పై మంచి అవగాహన ఉంది. ఎప్పుడు, ఏ పరిస్థితిలో ఏం చేయాలో మహీకి తెలుసు. ధోనీ జట్టుతో చేరడం ఖచ్చితంగా భారత జట్టు బలాన్ని పెంచుతుంది. దీంతో కోహ్లీ పని కూడా చాలా తేలికవుతుంది' అని ఎంఎస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. చహల్ బదులుగా చహర్ను జట్టులోకి తీసుకోవడంతో ఎన్నో అనుమానాలు రేకెత్తుకున్నాయన్నాడు. ధావన్, చహల్ జట్టులో లేకపోవడంతో పెద్ద చర్చనీయాంశం అయిందని ఎంఎస్కే పేర్కొన్నాడు.

డ్రీమ్ టీమ్:
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో పాల్గొనబోయే భారత క్రికెట్ జట్టు డ్రీమ్ టీమ్ను ఎంఎస్కే ఇదివరకే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లోో ముగ్గురు ఓపెనర్లకు అవకాశాన్ని కల్పించాల్సి ఉందన్నాడు. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మను కొనసాగిస్తూనే.. పృథ్వీ షాను కూడా తన డ్రీమ్ టీమ్లో చోటిచ్చాడు. విరాట్ కోహ్లీ తరువాత సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్.. బ్యాటింగ్ ఆర్డర్లో ఉండాలని ప్రసాద్ స్పష్టం చేశాడు. సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్లకు కూడా తన జట్టులో చోటిచ్చాడు.


Click it and Unblock the Notifications












