కొత్త రికార్డు ఖాయం:
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎమ్మెస్కే ప్రసాద్ ఐపీఎల్ 2020 మాట్లాడుతూ... అత్యధిక మంది వీక్షించిన ఐపీఎల్గా ఈసారి లీగ్ రికార్డు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'భారత్ నుంచి యూఏఈకి ఐపీఎల్ తరలి వెళ్లినందుకు కొందరు అభిమానులకు బాధగా అనిపించొచ్ఛు. స్టేడియంలో మ్యాచ్ చూసేవాళ్లు 30,000 నుంచి 70,000 మంది మాత్రమే. ఇంట్లో కూర్చుని అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువ మంది చూస్తారు. ఈసారి టీవీ వీక్షకుల పరంగా ఐపీఎల్ రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. వైరస్ కారణంగా ప్రస్తుతం 80 శాతం మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిసున్నారు. వాళ్లతో పాటు ఇంట్లో ఉండేవాళ్లు ఐపీఎల్ చూడడం పక్కా' అని ఎమ్మెస్కే పేర్కొన్నాడు.
ఆటగాళ్లకు భిన్నమైన సవాల్:
'ఐపీఎల్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ నిర్వహిస్తుండటం అభినందనీయం. ఈసారి ఐపీఎల్ ఆటగాళ్లకు భిన్నమైన సవాల్. ఐపీఎల్ అంటే ఆటగాళ్లు సరదాగా కనిపిస్తారు. నిజానికి వినోదం, ఒత్తిడి ఐపీఎల్లో భాగం. మ్యాచ్ ముగిసిన రోజు హోటల్కు వెళ్లేసరికి రాత్రి ఒంటి గంట అవుతుంది. ఉదయాన్నే 9 గంటలకు మరో వేదికకు ప్రయాణం కావాలి. మూడు రోజులకు ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలా ఉండదు' అని మాజీ చీఫ్ సెలెక్టర్ అన్నాడు.
ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యం:
'వైరస్ కారణంగా రెండు లేదా మూడు వేదికల్లోనే మ్యాచులు జరగనున్నాయి. ఆ వేదికలు కూడా పక్కపక్కనే ఉండటంతో ప్రయాణ సమయం కలిసొస్తుంది. దీంతో ఆటగాళ్లపై ఒత్తిడి కూడా తక్కువే ఉంటుంది. ప్రాక్టీస్ చేసేందుకు సమయం దొరుకుతుంది. ఒకవేళ కుటుంబంకు అనుమతి లేకపోతే.. దూరంగా ఉండటం కష్టం. ఇక భౌతిక దూరం పాటించడం ఇబ్బందికర విషయమే. అయితే ఒక్కసారి లీగ్ ప్రారంభమైతే 60 రోజులు చూస్తుండగానే గడిచిపోతాయి. కొన్ని ఫ్రాంచైజీలు క్వారంటైన్ సమయాన్ని మూడు రోజులకు కుదించాలనడం సరికాదు. ఆటగాళ్ల ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యం' అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు.