MS Dhoni: ఐపీఎల్ 2025లో చాలా ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో సీఎస్కే 2 వికెట్ల తేడాతో కేకేఆర్ను ఓడించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో చివరి ఓవర్లో రెండు బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్లో సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాటౌట్గా నిలిచాడు. తన జట్టును గెలిపించేందుకు 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోని కూడా తన ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి కీలక ప్రకటన చేశాడు.
ఇంకా రిటైర్మెంట్ ఆలోచన లేదు..
బుధవారం ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ చివరి దశలో ఉన్నానని ఒప్పుకున్నాడు. అయితే వెంటనే రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని, కాలక్రమేణా నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ఈ విజయంతో సీఎస్కే 4 మ్యాచ్ల వరుస పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. ఆ తర్వాత ఫ్యాన్స్ ఇచ్చిన మద్దతును ధోని ప్రశంసిస్తూ.. ప్రస్తుత సీజన్ చివరిలో రిటైర్ అయ్యే ఉద్దేశం తనకు లేదని సూచించాడు.

మ్యాచ్ తర్వాత ధోని మాట్లాడుతూ.. "ఇది నాకు ఎప్పుడూ లభించే ప్రేమ, ఆప్యాయత. నా వయస్సు 42 సంవత్సరాలు అని మర్చిపోవద్దు. నేను చాలా కాలంగా ఆడుతున్నాను. చాలా మందికి నా చివరి మ్యాచ్ ఎప్పుడు ఉంటుందో తెలియదని.. కాబట్టి వచ్చిన వాళ్లు నా ఆటను చూడాలనుకుంటున్నానని నవ్వుతూ ధోని అన్నాడు. వాస్తవాన్ని తప్పించుకునే అవకాశం లేదని.. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత తాను మరో ఆరు నుంచి 8 నెలలు కష్టపడి పని చేయాల్సి ఉంటుందన్నాడు. కానీ శరీరం ఒత్తిడిని తట్టుకోగలదా లేదా అని చూడాలన్నాడు. ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని.. కానీ మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత అద్భుతం అంటూ అభిమానులను ఉద్దేశించి అన్నాడు.
గెలిచిన సీఎస్కే
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (48), ఆండ్రీ రస్సెల్ (38), మనీష్ పాండే (36 నాటౌట్) రాణించడంతో నైట్ రైడర్స్ ఆరు వికెట్లకు 179 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా చెన్నైసూపర్ కింగ్స్, 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ.. డెవాల్డ్ బ్రెవిస్ (52 పరుగులు, 25 బంతులు, 4 సిక్సర్లు, 4 ఫోర్లు) అర్ధ సెంచరీతో చెలరేగిపోగా.. శివమ్ దూబే (45 పరుగులు, 40 బంతులు, 3 సిక్సర్లు, 2 ఫోర్లు)తో ఆరో వికెట్కు 67 పరుగుల భాగస్వామ్యంతో 19.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 183 పరుగులు చేసి మ్యాచ్ను గెలుచుకుంది.