టీమిండియా లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచం నలుమూలల నుంచి అతనికి బర్త్ డే విషెస్ కోకొల్లలుగా వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు అందరూ ధోనీకి విషెస్ చెప్తున్నారు. ఇక నెట్టింట ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయంలో ధోనీ గురించి ఎవరికీ తెలియని ఒక విషయాన్ని మాజీ దిగ్గజం వసీం జాఫర్ వెల్లడించాడు.
ధోనీకి 24 ఏళ్ల వయసులో ఉండగా తన కల ఏంటో జాఫర్తో చెప్పాడట. అదేంటంటే.. ఎలాగైనా ఒక రూ.30 లక్షలు సంపాదించి, ఆ డబ్బుతో రాంచీలో బతికేయాలని అనుకునేవాడట. ఇప్పుడు భారత దేశంలో అత్యధికంగా సంపాదించే క్రికెటర్లలో ధోనీ ఒకడు కావడం గమనార్హం. ఇటీవలే సినిమా నిర్మాణంలో కూడా ధోనీ ప్రవేశించిన సంగతి తెలిసిందే. తమిళ్లో ఒక సినిమా కూడా మొదలు పెట్టాడు.

'నేను 2005లో కంబ్యాక్ ఇచ్చా. అప్పుడు టీంలోకి ధోనీ కొత్తగా వచ్చాడు. నేను అప్పట్లో టెస్టులు ఆడితే, తను వన్డేలు ఆడేవాడు. మేం ఎప్పుడూ చివరి వరుసలో కూర్చునే వాళ్లం. నేను, నా భార్య, దినేష్ కార్తీక్, అతని భార్య, ధోనీ, ఆర్పీ సింగ్.. చివరి వరుసలో కూర్చునేవాళ్లం. అప్పట్లో మేం చాలా ఎక్కువ మాట్లాడుకునేవాళ్లం. నా భార్యతో కూడా ధోనీ చాలా ఎక్కవ ముచ్చట్లు చెప్పేవాడు' అని జాఫర్ గుర్తుచేసుకున్నాడు.
'తను రైల్వేస్లో పని చేసేవాడని అందరికీ తెలుసు. ప్రాక్టీస్ చేయడానికి చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కొన్నిసార్లు అతనికి ఆడే అవకాశం కూడా దక్కేది కాదు. ఆ తర్వాత ఉద్యోగం వదిలేశాడు. ఆ టైంలోనే తన కల ఏంటో చెప్పేవాడు. ఎలాగైనా రూ.30 లక్షలు సంపాదించి, తన మిగతా జీవితాన్ని రాంచీలో ప్రశాంతంగా గడిపేయాలని అతని ప్లాన్. అప్పుడే అంతర్జాతీయ టీంలోకి కొత్తగా రావడంతో ఇదే విషయం చెప్పేవాడు' అని జాఫర్ చెప్పాడు.
'ఒక రూ.30 లక్షలు సంపాదిస్తే.. ఆ తర్వాత ప్రశాంతంగా బతికేయొచ్చు' అంటుండేవాడట ధోనీ. 'ఆ మాట విని చాలా ఆశ్చర్యం వేసేది. చాలా సాధారణంగా ఉందా గోల్. నాకు తెలిసి ఇప్పుడు కూడా అలాంటి సాదా సీదా జీవితమే గడుపుతూ ఉండి ఉంటాడు. ఇంత గొప్ప కెరీర్, ఫ్యాన్స్.. ఎన్ని ఉన్నా ధోనీ అన్నీ చిన్న గోల్స్, చాలా చిన్న టార్గెట్లు పెట్టుకొని ముందుకు సాగుతుంటాడు. ఆ వినయం చాలా గొప్పది' అని జాఫర్ అభిప్రాయపడ్డాడు.