మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు హార్ట్ బ్రేక్ న్యూస్. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ ఐపీఎల్కు గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ముగిసిన అనంతరం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా వెల్లడించింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత సీఎస్కే అభిమానులు స్టేడియంలోనే ఉండాలని కోరింది. 'గేమ్ ముగిసిన అనంతరం సూపర్ ఫ్యాన్స్ బయటకు వెళ్లకండి. ఓ ప్రత్యేకమైన విషయం తెలియనుంది' అని చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ధోనీ ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించిననున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇవాళే ఎందుకు ప్రకటిస్తున్నారు?
మే 26 తేదీన ఐపీఎల్-2024 సీజన్ ముగుస్తోంది. లీగ్ స్టేజ్ మ్యాచ్లు మే 19వ తేదీతో పూర్తవుతాయి. ఇక సీఎస్కే తమ ఆఖరి లీగ్ మ్యాచ్ను మే 18న చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో ఆడనుంది. అయితే చెన్నై వేదికగా సీఎస్కేకు ఇవాళే ఆఖరి లీగ్ మ్యాచ్. చెన్నై జట్టు ప్లేఆఫ్స్కు వెళ్లే అవకాశాలు సంక్లిష్టం కావడంతో ఇవాళే తన అభిమానులతో ధోనీ ప్రత్యక్షంగా తన రిటైర్మెంట్ను ప్రకటించాలనుకుంటున్నాడు.
చెన్నైలోని చెపాక్ వేదికగా క్వాలిఫయిర్-2, ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. కానీ, సీఎస్కే ప్లేఆఫ్స్కు అర్హత సాధించకపోతే తన రిటైర్మెంట్ విషయాన్ని చెన్నై ప్రజల మధ్య నేరుగా చెప్పలేనేమోనని ధోనీ భావించినట్లు తెలుస్తోంది. అందుకే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. ఒకవేళ చెన్నై జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధించినా, మైదానంలో ధోనీని చూడటానికి క్వాలిఫయిర్, ఫైనల్లోనే అవకాశం ఉంటుందని అభిమానులు ముందుగానే అర్థంచేసుకుంటారనే ఆలోచనతోనూ ఇవాళ ప్రకటించనున్నారు.
ఐపీఎల్లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్తో పాటు రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ తరఫున కూడా ప్రాతినిథ్యం వహించాడు. లీగ్లో 263 మ్యాచ్లు ఆడిన ధోనీ 5218 పరుగులు చేశాడు. 24 అర్ధశతకాలు సాధించాడు. 14 సీజన్లలో సీఎస్కే జట్టును నడిపించిన ధోనీ అయిదు సార్లు జట్టును విజేతగా నిలిపాడు. 42 ఏళ్ల ధోనీ ఈ సీజన్లో వికెట్ కీపర్గానే బరిలోకి దిగాడు. ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టు బాధ్యతలు అందుకున్నాడు.