గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో ఎనిమిదో స్థానంలో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్కు రావడంపై చర్చ అనవసరమని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 35 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో తమ స్థానంపై ప్రభావం చూపనప్పటికీ సీఎస్కే నెట్ రన్ రేటును తగ్గించుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 231 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (104; 55 బంతుల్లో, 9x4, 6x6), సాయి సుదర్శన్ (103; 51 బంతుల్లో, 5x4, 7x6) శతకాలతో విరుచుకుపడ్డారు. అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కే 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 196 పరుగులు చేసింది.

డారిల్ మిచెల్ (63; 34 బంతుల్లో, 7x4, 3x6), మొయిన్ అలీ (56; 36 బంతుల్లో, 4x4, 4x6) అర్ధశతకాలతో పోరాడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ (3/31) మూడు, రషీద్ ఖాన్ (2/38) రెండు వికెట్లతో సత్తాచాటారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోనీ (26*; 11 బంతుల్లో, 1x4, 3x6) సిక్సర్లతో అలరించి ఓటమి అంతరాన్ని తగ్గించాడు.
కాగా, సీఎస్కే ఓటమి గురించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నై ఓటమికి ధోనీ కారణం కాదని అన్నాడు. ధోనీ బ్యాటింగ్ పొజిషన్పై చర్చను ఇకపై ఆపేయాలని కోరాడు. గిల్-సుదర్శన్ తరహాలో డారిల్ మిచెల్, మొయిన్ అలీ బ్యాటింగ్ చేయలేపోయారని పేర్కొన్నాడు. ''ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చను ముగించాలి. అతను ఏం చేయాలనుకుంటున్నాడో అతనికి తెలుసు. అది అతని ఇష్టం. అయితే మ్యాచ్ గెలవాలంటే ధోనీలా ఇతర బ్యాటర్లు కూడా అదే స్ట్రైక్రేటుతో పరుగులు చేయాలి''
''సుదర్శన్-గిల్ ఆటకు దీటుగా మిచెల్, అలీ బ్యాటింగ్ చేయలేదు. సీఎస్కే జట్టులో ఎవరైనా సెంచరీ చేసినా, జడేజా లేదా దూబె 20 బంతుల్లో అర్ధశతకం బాదినా సీఎస్కే లక్ష్యానికి చేరువగా వచ్చేది. ఇక ధోనీ బ్యాటింగ్ గురించి నేను చర్చించాలనుకోవట్లేదు. అతను ఎక్కడ బ్యాటింగ్ చేసినా సరే ఫర్వాలేదు. అతడు బాగా ఆడుతున్నాడు. ప్రజలన్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. సీఎస్కే గెలిస్తే ఏంటి? ఓడితే ఏంటి? పబ్లిక్ ఎంజాయ్ చేస్తుంది'' అని సెహ్వాగ్ అన్నాడు.