MS Dhoni: క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా ఎంఎస్ ధోనీ అభిమానులకు సర్ప్రైజింగ్ న్యూస్. ఎంఎస్ ధోనీ ఇకపై కేవలం స్టేడియంలోనే కాకుండా వెండితెరపై కూడా అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆర్.మాధవన్ సెప్టెంబర్ 7న తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక టీజర్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ టీజర్లో మహేంద్ర సింగ్ ధోనీ ఫుల్ యాక్షన్ రోల్లో కనిపించడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. కూల్ కెప్టెన్ కాస్తా యాక్షన్ హీరోలా మారిపోయాడు.
యాక్షన్ హీరోగా ధోనీ
ఆర్.మాధవన్, వసన్ బాల డైరెక్షన్లో రూపొందుతున్న 'ది ఛేజ్' అనే ప్రాజెక్టు టీజర్ను విడుదల చేశారు. ఇందులో ఆర్.మాధవన్తో పాటు ఎంఎస్ ధోనీ కూడా టాస్క్ఫోర్స్ ఆఫీసర్గా తుపాకీ పట్టుకుని బుల్లెట్ల వర్షం కురిపిస్తూ కనిపించారు. వారిద్దరూ ఒకే తరహా యూనిఫామ్ ధరించి ఉన్నారు. ఇది చాలా సరదాగా, ఉత్కంఠభరితమైన యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఆర్.మాధవన్ తన పోస్ట్లో "ఒక మిషన్. ఇద్దరు యోధులు. మీ సీట్బెల్ట్లను బిగించుకోండి - ఒక వైల్డ్, ఉత్కంఠభరితమైన ఛేజ్ మొదలవుతుంది" అని రాశారు. అయితే, ఇది సినిమానా, వెబ్ సిరీసా లేదా ఏదైనా ప్రకటననా అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

ప్రశ్నల వర్షం
ఈ టీజర్ విడుదలైన వెంటనే నెట్టింట వైరల్ అయింది. ఎంఎస్ ధోనీ అభిమానులు, నెటిజన్లు ఆనందంతో షేర్ చేస్తూనే.. ఇది ఏ రకమైన ప్రాజెక్టు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎంఎస్ ధోనీ ఇదివరకే అనేక ప్రకటనలలో అలాగే 'ది గోట్' అనే తమిళ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. కానీ ఇలా పూర్తి స్థాయిలో యాక్షన్ పాత్రలో కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో ఇది ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ అయ్యే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ధోనీ క్రికెట్ కెరీర్
మహేంద్ర సింగ్ ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్ అయ్యారు. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి మాత్రం ఇంకా రిటైర్ కాలేదు. ప్రస్తుతం ఆయన సీఎస్కే తరపున ఆడుతున్నారు. ఐపీఎల్ 2026లో కూడా ఆయన సీఎస్కేకు ఆడతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ధోనీ సినీ రంగ ప్రవేశం చేస్తే.. క్రికెట్ తర్వాత ఆయన అభిమానులను ఏ విధంగా అలరిస్తారో చూడాలి.