రిటైర్మెంట్పై ఊహాగానాలు:
తాజాగా బీసీసీఐ 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకూ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులోనూ ధోనీ పేరు లేదు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనున్న తరుణంలో మహీ పేరు కాంట్రాక్ట్ లిస్టులో లేకపోవడం అందరిని విస్మయానికి గురి చేసింది. ఇక ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి.
ఝార్ఖండ్ రంజీ జట్టుతో ప్రాక్టీస్
అయితే బీసీసీఐ తనను కాంట్రాక్ట్ జాబాతా నుంచి తప్పించిన రోజే ధోనీ ఝార్ఖండ్ రంజీ జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. రంజీ జట్టుతో కలిసిన ధోనీ అక్కడ వైట్బాల్తో ఎక్కువగా ప్రాక్టీస్ చేసాడు. దీంతో ఐపీఎల్-2020కి సన్నద్ధం అవుతున్న విషయాన్ని మహీ చెప్పకనే చెప్పేశాడు. అయితే మహీ ఈ ఏడాదే కాదు.. వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడతాడని చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్ అంటున్నాడు.
2021 ఐపీఎల్ కూడా ఆడుతాడు
శనివారం ఒక ఈవెంట్కు హాజరైన శ్రీనివాసన్ మాట్లాడుతూ ధోనీ అభిమానులకు శుభవార్త చెప్పాడు. 'ధోనీ 2020 ఐపీఎల్ ఆడుతాడు. 2020 ఐపీఎల్తో పాటు 20021 ఐపీఎల్లో కూడా ధోనీ తమ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. వచ్చే ఏడాది మహీ వేలంలో ఉన్నా మేమే తీసుకుంటాం. ధోనీపై నమ్మకం ఉంది, వచ్చే రెండు ఐపీఎల్ సీజన్లలో ధోనీ నేతృత్వంలోనే బరిలోకి దిగుతాం' అని శ్రీనివాసన్ చెప్పుకొచ్చాడు.
ప్రారంభం నుండి చెన్నై జట్టుకే ధోనీ:
ధోనీ ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుకే ఆడుతున్నాడు. సారధిగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. నిషేధం సమయంలో రెండు సంవత్సరాలకు పూణే జట్టుకు ఆడాడు. మహీ చెన్నై జట్టుకు మూడుసార్లు టైటిల్ అందించాడు. గతేడాది హైదరాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్తో తలపడి ఒక్క పరుగుతో చెన్నై ఓటమిపాలైంది. అయితే ఈసారి టైటిల్ గెలవాలని చెన్నై కసిగా ఉంది.