ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులు ఎప్పుడు జరిగినా అక్కడకు ఫ్యాన్స్ కోకొల్లలుగా వెళ్లిపోయారు. తమ టీంకు మద్దతు తెలుపుతూ ఆ స్టేడియాలను పచ్చ రంగుతో నింపేశారు. దీనికి ప్రధాన కారణం.. ఇదే సీఎస్కే సారధి ఎంఎస్ ధోనీకి చివరి సీజన్ అని ప్రచారం జరగడమే. మరి దీనిలో నిజమెంత?
చాలా మంది ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని అంటున్నారు. అదే సమయంలో ధోనీకి సన్నిహితులైన సురేష్ రైనా వంటి వాళ్లు అలాంటిదేం లేదన్నారు. చివరకు కెవిన్ పీటర్సన్ కూడా ధోనీ కనీసం ఇంకో రెండు, మూడేళ్లు ఆడతాడని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ధోనీకి బాగా కలిసొస్తుందని అన్నాడు.

ఇప్పుడు ఈ విషయంపై చెన్నై బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో కూడా ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ టీంకు ధోనీ కామ్నెస్ చాలా సాయం చేస్తోందని బ్రావో అన్నాడు. ముఖ్యంగా ఒత్తిడి పెరిగే సమయాల్లో ధోనీ ప్రశాంతంగా ఉండటం వల్ల టీం చాలా విజయాలు సాధించిందని కొనియాడాడు.
ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోనీ ఆడతాడా? అని బ్రావోను ప్రశ్నించగా.. వంద శాతం ఆడతాడని బదులిచ్చాడీ కరీబియన్. 'ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల అతని కెరీర్ను మరింత పొడిగించుకునే ఛాన్స్ ఉంది. మా బ్యాటింగ్ చాలా డీప్గా ఉంటుంది. అజింక్య రహానే, శివమ్ దూబే వంటి వాళ్లు మ టీంలో బలం' అని చెప్పుకొచ్చాడు.
అదే సమయంలో ధోనీ నుంచి కూడా అంతగా ఆశిస్తామని చెప్పాడు. 'కానీ జట్టు మొత్తం ఒత్తిడిలో ఉన్నప్పుడు మమ్మల్ని కామ్గా ఉంచే ట్యాలెంట్ ధోనీకి మాత్రమే ఉంది. దాన్ని ఎవరూ మ్యాచ్ చేయలేరు' అని తేల్చేశాడీ ఐపీఎల్ లెజెండ్. గుజరాత్పై గెలిచిన తర్వాత ప్రముఖ కామెంటేటర్ హర్షభోగ్లే కూడా నేరుగా ధోనీనే ఈ ప్రశ్న అడిగాడు. దీనికి సరదాగా బదులిచ్చిన ధోనీ.. రిటైర్మెంట్ గురించి ఆలోచించడానికి ఇంకా చాలా టైం ఉందన్నాడు.
ప్రస్తుతానికైతే ఐపీఎల్ తర్వాత కుటుంబంతో కలిసి గడపడం గురించే ఆలోచిస్తున్నానని ధోనీ చెప్పాడు. 'ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన లేదు. ఒక 8-9 నెలల టైం ఉంది కదా. డిసెంబర్లో చిన్న వేలం ఉంటుంది. దాని గురించి ఇప్పుడే తలనొప్పి ఎందుకు? డిసైడ్ అవ్వడానికి నా దగ్గర చాలా టైం ఉంది. అయితే ఆటగాడిగా అయినా, లేదంటే మరే రూపంలో అయినా ఎప్పటికీ సీఎస్కేతోనే ఉంటా' అని చెప్పాడీ లెజెండ్.