హైదరాబాద్: భారత జట్టు మాజీ కెప్టెన్పై చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. దశాబ్ద కాలంగా బౌలర్లలో ఇంత ప్రతిభ కనబడిందంటే అది ఖచ్చితంగా కెప్టెన్గా ధోనీ అనుసరించిన పద్ధతేనని ఆయన పేర్కొన్నాడు. ఒక బౌలర్కు ధోనీ ఇచ్చినంత స్వేచ్ఛను మరే కెప్టెన్ ఇవ్వడని తెలిపాడు. జట్టులోనే కాదు డ్రెస్సింగ్ రూమ్ లోనూ చక్కటి వాతావరణాన్ని నెలకొల్పి జట్టు మంచి ప్రదర్శన ఇచ్చేందుకు సహకరిస్తాడని వివరించాడు.
'సాధారణంగా మైదానంలో మహేంద్రసింగ్ ధోనీ బౌలర్లని కదపడు. వారికి కావాల్సినంత స్వేచ్చ ఇచ్చి బౌలింగ్ చేయమంటాడు. కానీ.. బౌలర్ లయ తప్పుతుంటే మాత్రం.. చిన్నపాటి సూచనలతో మొదలెట్టి.. అవసరమైన సలహాలు ఇస్తాడు. అంతేగానీ.. బౌలర్ నుంచి సామర్థ్యానికి మించిన ప్రదర్శనని రాబట్టుకోవాలని ఆరాటపడడు. ధోనీ లాంటి గొప్ప కెప్టెన్ సారథ్యంలో బౌలర్లు చాలా విషయాలు నేర్చుకోవచ్చు' అని బాలాజీ వివరించాడు.
మైదానంలో బౌలర్లకి కావాల్సినంత స్వేచ్ఛని భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ వెల్లడించాడు. ఏప్రిల్ 7న ముంబయి ఇండియన్స్తో టోర్నీ తొలి మ్యాచ్లోనే చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ప్రస్తుతం జట్టుని సిద్ధం చేసే పనిలో ఉన్న బాలాజీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ధోనీ కెప్టెన్సీ గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు. ధోనీ సారథ్యంలోనే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన బాలాజీ.. ఇప్పుడు బౌలింగ్ కోచ్గా పనిచేస్తున్నాడు.
చెన్నై జట్టు ఆటగాడైన అంబటి రాయుడు మాట్లాడుతూ.. చెన్నై జట్టు మంచి నాయకుడితో మళ్లీ ఐపీఎల్లో ఆడుతున్నందుకు ఆనందంగా ఉందని అన్నాడు. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టుకు రెండు ప్రపంచ కప్లు వచ్చాయని ఇంతకంటే గొప్ప నాయకుడు జట్టుకు అవసర్లేదన్నాడు.
రెండేళ్ల నిషేదం అనంతరం ఐపీఎల్ 11 సీజన్ కు సిద్ధం కాబోతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఆటగాళ్ల దగ్గర్నుంచి కోచ్లతో సహా జట్టుకు కావాలసిన సిబ్బందిని సైతం కుదుర్చుకున్న చెన్నై జట్టు ఐపీఎల్కు సిద్ధం అయింది.