
టాస్ గెలిచి ఇలా సంచలన వ్యాఖ్యలు చేసిన ధోనీ
మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ 2022సీజన్లో తన చిట్టచివరి మ్యాచ్ నేడు రాజస్థాన్ రాయల్స్తో ఆడబోతుంది. ముంబైలోని సీసీఐ బ్రబౌర్న్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30గంటలకు మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. కామెంటేటర్ ధోనీని మీరు తర్వాతి సీజన్లో ఆడతారా అని అడగ్గా ధోనీ కుండబద్ధలు కొట్టినట్లు బదులిచ్చాడు. వచ్చే సీజన్లో తప్పకుండా తాను ఆడతానని పేర్కొన్నాడు. అయితే అదో క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ సీఎస్కే అభిమానుల కోసమైనా తర్వాతి సీజన్ ఆడతా అంటూ స్పష్టం చేశాడు.

ధోనీ ఏమన్నాడో అతని మాటల్లోనే..
ధోనీ మాట్లాడుతూ.. డెఫినెట్లీ తర్వాతి సీజన్లో ఆడతాను. ఎందుకంటే చాలా సాధారణ కారణమే. చెన్నై తరఫున చెన్నైలో ఆడకపోవడం, చెన్నై అభిమానులకు నా చివరి మ్యాచ్ ద్వారా వీడ్కోలు పలకకపోవడం అన్యాయం. ఈ సీజన్లో మ్యాచ్లన్నీ ముంబైలో జరిగాయి. ముంబై కూడా మంచి వేదిక. ఇక్కడ చెన్నై జట్టుకు, ప్లేయర్గా నాకు అభిమానుల నుంచి ప్రేమాభిమానాలు అందుతున్నాయి. కానీ ఈ ఐపీఎల్లోనే నా కెరీర్ ముంబై వేదికగా ముగించడం సరికాదు. అలా చేస్తే సీఎస్కే అభిమానులు చాలా ఫీలవుతారు. వచ్చే సీజన్లో కొవిడ్ నిబంధనలు పెద్దగా ఉండకపోవచ్చని ఆశిస్తున్నాను. వచ్చే సంవత్సరం అన్ని జట్లు ముంబైతో పాటు వివిధ వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్లు ఆడే అవకాశముంటుంది. కాబట్టి సీఎస్కే తరఫున నేను కూడా వేర్వేరు స్టేడియాలల్లో మ్యాచ్లు ఆడడానికి వీలవుతుంది.
అప్పుడు వివిధ ప్రదేశాల్లోని అభిమానులకు ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంటుంది. ఫైనల్గా చెన్నై స్టేడియంలో చెన్నై అభిమానులకు వీడ్కోలు పలికేందుకు ఓ ఛాయిస్ ఉంటుంది. ఇది నా అభిప్రాయం. ఇక ఐపీఎల్లో ఆడడం ఇదే నాకు చివరి సీజన్ అవుతుందో లేదో అనేది ఇంకా నాకు ఓ పెద్ద ప్రశ్నలాంటిదే. ఎందుకంటే నిజంగా రెండు సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కోవిడ్ లాంటి పరిస్థితుల వల్ల ఏం జరుగుతుందో అంచనా వేయలేము. కానీ కచ్చితంగా నేను వచ్చే ఏడాది మరింత ఎఫిషియేన్సీతో చెన్నై జట్టుతో తిరిగి రావడానికి కృషి చేస్తాను' అని ధోనీ పేర్కొన్నాడు.

ప్లేఆఫ్ చేరకుండానే ఈ సీజన్ ముగింపు
ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ టీమ్ 16పాయింట్లతో పాజిటివ్ నెట్ రన్ రేట్తో ఇప్పటికే ప్లేఆఫ్స్ ఖాయం చేసుకుంది. తాజాగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లోనూ గెలిస్తే 18పాయింట్లతో టాప్ 2పొజిషన్కు వెళ్తుంది. గెలవకపోయినా ప్లేఆఫ్స్ చేరుతుంది. చెన్నై సూపర్ కింగ్స్కు మాత్రం గెలిచినా, గెలవకున్నా పెద్దగా పోయేదేం లేదు. ఈ మ్యాచ్లోనైనా గెలిచి ఈ సీజన్ను కాస్త తల ఎత్తుకునేలా ముగించాలని మాత్రం చెన్నై భావిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్ 2020సీజన్లో ప్లేఆఫ్ చేరకుండా ఇంటిబాట పట్టిన చెన్నై ఈ సీజన్లోనూ ప్లేఆఫ్ చేరకుండానే లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. రాజస్థాన్ రాయల్స్పై నేటి మ్యాచ్లో గెలిస్తే పాయింట్ల పట్టికలో ఆ జట్టు పాయింట్లు 10కి చేరుకుంటాయి. తద్వారా కాస్త గౌరవంగా లీగ్ను ముగించే వీలుంటుంది.


Click it and Unblock the Notifications
