|
వింటేజ్ కారు:
భర్త ఎంఎస్ ధోనీ తనకు అరుదైన బహుమతిని ఇచ్చిన విషయాన్ని సాక్షి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకుంది. లేత నీలం, తెలుపు రంగు కాంబినేషన్లో ఉన్న అంబాసిడర్ కారు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కారుతో పాటు వారిద్దరూ కలిసి దిగిన మరికొన్ని ఫొటోలను కూడా సాక్షి పోస్ట్ చేసింది. అందులో కూతురు జీవా కూడా ఉంది. గతేడాది ఎవరూ ఊహించని రీతిలో ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రమే మహీ ఆడుతున్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలోనే వాయిదా పడడంతో అతడు ఇంటికివెళ్లిపోయాడు.
స్నేహం కాస్త ప్రేమగా:
ఎంఎస్ ధోనీ, సాక్షి సింగ్ తండ్రులు ఒకేచోట కలిసి పనిచేసేవారు. దాంతో ధోనీ-సాక్షి కూడా ఒకేచోట కలిసి చదువుకున్నారు. సాక్షికి మహీ సీనియర్ అయినా.. మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆ తర్వాత సాక్షి తండ్రికి ఉద్యోగం మారడంతో వేరే చోటుకు వెళ్లిపోయారు. దీంతో వీరు చాలాకాలం దూరంగానే ఉన్నారు. 2007లో అనుకోకుండా ఓ కామన్ స్నేహితుడి ద్వారా వీరిద్దరు మళ్లీ కలుసుకున్నారు. ఆ సమయంలో సాక్షి ఓ హోటల్లో ఇంటర్న్షిప్ చేస్తోంది. ఓ రోజు మ్యాచ్లో భాగంగా అదే హోటల్లో బసకు దిగారు భారత ఆటగాళ్లు. అయితే సాక్షికి తెలియకుండా ఆ హోటల్ మేనేజర్ దగ్గర నుంచి ఆమె ఫోన్ నెంబరు తీసుకుని తనకు మెసేజ్లు చేయడం ప్రారంభించాడు ధోనీ. అలా వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆపై 2010లో జులై 4న పెళ్లి చేసుకున్నారు.
ఆగష్టు 15న గుడ్ బై:
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గతేడాది ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్లో ధోనీ 90 టెస్ట్ మ్యాచ్ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్ల్లో 10773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్లలో 1600 పరుగుల బాదాడు. ఐపీఎల్ టోర్నీలో 211 మ్యాచులు ఆడి 4669 రన్స్ చేశాడు.