|
ధోనీ రనౌట్ వివాదం..
అయినప్పటికీ- న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ధోనీ ఎదుర్కొన్న బంతికి అతని వికెట్ బలి కోరడం అనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనల ప్రకారం విరుద్ధమని చెబుతున్నారు. ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో బుధవారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ధోనీ రనౌట్ అయిన విషయం తెలిసిందే. అప్పటిదాకా కొద్దో, గొప్పో ఉన్న ఆశలు ధోనీ రనౌట్తో పూర్తిగా కొడిగట్టాయి. దారుణ పరాజయానికి దారి తీసింది ధోనీ రనౌట్. ధోనీ పెవిలియన్ దారి పట్టిన తరువాత వచ్చిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితం- దారుణ ఓటమి.
|
ఎలా నో బాల్ అవుతుంది?
న్యూజిలాండ్ ఇన్నింగ్ 48 ఓవర్ను లోకీ ఫెర్గూసన్ సంధించాడు. అది పవర్ ప్లే. ఆ ఓవర్ మూడో బంతికి ధోనీ షాట్ ఆడటానికి ప్రయత్నించగా.. అది అతని గ్లోవ్స్ను తాకి గాల్లోకి లేచింది. షాట్ ఆడిన వెంటనే- ధోనీ పరుగు తీశాడు. ఓ రన్ పూర్తి చేశాడు. ఇంకో రన్ కోసం స్ట్రైకింగ్ ఎండ్ వైపు వస్తుండగా.. బంతిని అందుకున్న మార్టిన్ గప్టిల్ బుల్లెట్లా వదిలాడు దాన్ని. ధోనీ క్రీజ్కు చేరుకోకముందే- వికెట్లను ఎగురగొట్టిందా బాల్. దీనితో నిరాశగా వెనుదిరిగాడు ధోనీ. అక్కడే- న్యూజిలాండ్ జట్టు ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 48వ ఓవర్ పవర్ ప్లే. బ్యాట్స్మెన్ పవర్ ప్లే తీసుకున్న సమయంలో ఐసీసీ నిబంధనల ప్రకారం.. 30 గజాల లోపు ఉండే ఇన్నర్ సర్కిల్లో కేవలం అయిదుమంది ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. అది నిబంధన. దీనికి భిన్నంగా పవర్ ప్లే సమయంలో ఆరుమంది ఫీల్డర్లు 30 గజాల లోపు ఉండే ఇన్నర్ సర్కిల్లో ఉన్నట్లు తేలింది.
|
నిబంధనలకు విరుద్ధంగా..
ఫీల్డింగ్ చేస్తోన్న ఏ జట్టయినా గానీ.. ఇలా ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు బౌలర్ సంధించిన బంతిని నో బాల్గా ప్రకటిస్తారు అంపైర్లు. ఈ నో బాల్కు బ్యాట్స్మెన్ రనౌట్ అయినా కూడా పరిగణనలోకి తీసుకోకూడదనేది ఐసీసీ నిబంధన చెబుతోంది. దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సింది అంపైర్ మాత్రమే. ఓల్డ్ ట్రాఫొర్డ్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఫీల్డర్లు ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని అంపైర్ గమనించినట్లు లేరు. అందుకే- ధోనీ అవుటైన వెంటనే వేలిని పైకి లేపారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది.
|
అంపైరింగ్పై ధ్వజం..
భారత క్రికెట్ అభిమానులు అంపైరింగ్ వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు. అందులోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. మహేంద్రసింగ్ ధోనీ నోబాల్ అవుట్ అయ్యాడని, ఫలితంగా- అతి కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు పరాజయాన్ని చవి చూసిందని అంటున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ నిలదీస్తున్నారు. ఈ లోపాన్ని అంపైర్లు గమనించి ఉండి ఉంటే- మ్యాచ్ పరిస్థితి ఇంకోలా ఉంటుందని చెబుతున్నారు. అంపైరింగ్ వ్యవస్థ చెత్తచెత్తగా తయారైందని ఆడిపోసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆరుమంది ఫీల్డర్లు 30 గజాల లోపు ఇన్నర్ సర్కిల్లో ఫీల్డింగ్ మోహరించి ఉన్నప్పటికీ.. ఎందుకు గమనించలేకపోయారంటూ నిప్పులు చెరుగుతున్నారు అభిమానులు.