
హైదరాబాద్: భారత జట్టులోని ఆటగాళ్ల జీతాల పంపై విషయమై ఇటీవలే బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనిలు కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ బీసీసీఐ ముందు మరో డిమాండ్ని ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుణ్యమా అని జట్టులోని యువ ఆటగాళ్లకు ప్రాముఖ్యత పెరిగిపోతోంది. ఫస్ట్ క్లాస్ రాణించినా.. కొందరు ఆటగాళ్లు సరైన సంపాదన లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరేమో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, ధోని బీసీసీఐ ముందు చేసిన ఓ ప్రతిపాదన టీమిండియాకి ఆడకుండానే కొంతమంది యువ క్రికెటర్లను కోటీశ్వరులను చేసింది. రంజీ, రాష్ట్రస్థాయి టోర్నీల్లో సత్తాచాటుతున్న క్రికెటర్లకు సైతం మంచి జీతాలు ఇవ్వాలని బీసీసీఐని కోరారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ ఏడాది హైదరాబాద్కి చెందిన మహ్మద్ షిరాజ్ (రూ. 2.6 కోట్లు), టి. నటరాజన్ (రూ.3 కోట్లు)తో పాటు కర్ణాటకకు చెందిన కేసీ కరియప్పను ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. కర్ణాటక ప్రీమియర్ లీగ్లో కూడా కొన్ని మ్యాచ్లు ఆడాడు. కానీ.. కర్ణాటక రంజీ జట్టు తరఫున మాత్రం కరియప్ప ఒక మ్యాచ్ కూడా ఆడలేదు.
ఇలా కర్ణాటక రంజీ జట్టు తరుపున ఆడకపోయినా కేసీ కరియప్ప లాంటి ఆటగాళ్లు అధికంగా జీతాలు అందుకోవడం వల్ల ఫస్ట్క్లాస్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. వాటిని నివారించాలంటే బీసీసీఐ యువ క్రికెటర్లకి తగిన అవకాశాలు కల్పించాలని ధోని, కోహ్లి బీసీసీఐకి సూచించారని ఆయన చెప్పారు.
కొంతమంది క్రికెటర్లు రంజీ ట్రోఫీలో ఆడుతున్నప్పటికీ వారు సీజన్ మొత్తానికి రూ. 10-12 లక్షలు మాత్రమే సంపాదిస్తున్నారని అన్నారు. మరోవైపు మరికొందరు ఆటగాళ్లకు మాత్రం కోటానుకోట్ల నగదు వస్తుందని ఆయన తెలిపారు. ఇది సరైన విధానం కాదని బీసీసీఐ అందరూ ఆటగాళ్లకి సమానంగా వేతనాలు ఇవ్వాలని కోహ్లీ, ధోని కోరినట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించనప్పటికీ కొందరు ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. 2017లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో ఆల్ రౌండర్ పవన్ నేగిని ఢిల్లీ డేర్ డేవిల్స్ ఫ్రాంచైజీ రూ. 8.5 కోట్లకు కోనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక, టీ నటరాజన్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 3 కోట్లకు వేలంలో దక్కించుకుంది. ఇలా భారత క్రికెట్ తరుపున ఆడుకున్నప్పటికీ కొందరు క్రికెటర్లకు ఐపీఎల్ ద్వారా పెద్ద మొత్తంలో జీతాలను తీసుకుంటున్నారు. ఈ విషయమై కోహ్లీ, ధోని తాజా ప్రతిపాదనను చేసినట్లు తెలుస్తోంది.