హైదరాబాద్: రైజింగ్ పూణె సూపర్ జెయింట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్ నిబంధనలను ఉల్లంఘించాడు. గురువారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోని నిబంధనలను అతిక్రమించాడని ఐపీఎల్ అధికార ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటనలో ధోనిని మ్యాచ్ రిఫరీ మందలించాడని పేర్కొంది. 'వివో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో ధోని ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో లెవల్ వన్ (ఆర్టికల్ 2.1.1) అతిక్రమణకు పాల్పడ్డాడు. క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించేలా అతడు వ్యవహరించాడు. దీనిపై మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడాలి' అని ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే ధోనిని మ్యాచ్ రిఫరీ ఎందుకు మందలించాడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే గురువారం నాటి మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పూణె జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ధోని ఈ మ్యాచ్లో సరదాగా రివ్యూ కోసం వెళ్లాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో భాగంగా తమ జట్టు లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ వేసిన బౌలింగ్లో ధోని రివ్యూ కోరాడు.
పొలార్డ్ని అవుట్ చేసేందుకు ధోని రివ్యూ అంటూ సైగ చేశాడు. నిజానికి ఐపీఎల్లో రివ్యూలు లేకపోయినా థర్డ్ అంపైర్ అంటూ ధోని సంకేతాలిచ్చాడు. తాహీర్ అప్పీల్కు అంపైర్ స్పందిచకపోవడంతో ధోని ఇలా చేసి నవ్వులు పూయించాడు. టీవీ రిప్లేలో అది అవుట్గా కనిపించినా, ఐపీఎల్లో డీఆర్ఎస్ లేకపోవడంతో పొలార్డ్ బతికిపోయాడు. అయితే ఐపీఎల్లో డీఆర్ఎస్ లేకపోయినప్పటికీ పరోక్షంగా అంపైర్ నిర్ణయాన్ని అసహనంతో వ్యంగ్యంగా సిగ్నల్ రూపంలో తెలియజేశాడు. అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ధోని వ్యవహరించడం ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది.
పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. ధోని 12 బంతుల్లో 12 పరుగులు నమోదు చేసి నాటౌట్గా నిలిచాడు. 185 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రహానే (34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) మెరుపులు మెరిపించడంతో ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది.