న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్న మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గురువారం(జులు 7)న 35వ పడిలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం టీమిండియాకు వన్డే, టీ20 కెప్టెన్గా వ్యవహరిస్తున్న ధోనీని తోటి క్రికెటర్లు, ప్రముఖులతోపాటు అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.
'హ్యాపీ బర్త్ డే కెప్టెన్ కూల్' అంటూ సోషల్ మీడియాను మోతెక్కిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖల నుంచి కూడా ధోనీ జన్మదిన శుభాకాంక్షలు అందుకున్నాడు. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నుంచి సుశాంత్ సింగ్ రాజ్పుత్ వరకు బాలీవుడ్ ప్రముఖులు విషెస్ తెలిపారు.
ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న బాలీవుడ్ చిత్రంలో ధోనీ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ధోనీ పుట్టిన రోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు సుశాంత్.

కాగా, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ సందర్భంగా ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక జులై 7ను 'నేషనల్ హెలికాప్టర్ డే'గా ప్రకటించాలని కోరాడు.