న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ శిబిరం నుంచి ఇంటికి వెళ్లే చివరి వ్యక్తిని తానే అవుతానని ఆ జట్టు కెప్టెన్, టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో పలు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ప్రత్యేక విమానాల్లో ఇళ్లకు పంపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ ఆటగాళ్లంతా క్షేమంగా ఇళ్లకు చేరిన తర్వాతే తాను వెళ్తానని మహీ స్పష్టం చేశాడు. ముందుగా విదేశీ ఆటగాళ్లు ఇళ్లకు వెళ్తారని ఆ తర్వాత భారత ఆటగాళ్లు వెళ్లాలని సూచించాడు.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఢిల్లీలో ఉంది. ఇటీవల వర్చువల్గా నిర్వహించిన సమావేశంలో జట్టు సభ్యులతో ధోనీ మాట్లాడాడు. ఐపీఎల్ భారత్లో జరుగుతోంది. కాబట్టి తొలుత విదేశీ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది వెళ్లాలి. ఆ తర్వాతి ప్రాధాన్యం భారతీయ ఆటగాళ్లది. హోటల్ నుంచి వెళ్లే చివరి వ్యక్తిని నేనే'అని ధోనీ పేర్కొన్నాడు. ఆటగాళ్లను సొంత నగరాలకు చేర్చేందుకు సీఎస్కే చార్టర్ విమానాలను ఏర్పాటు చేసింది.
పది మంది ప్రయాణించగల ఈ విమానం గురువారం ఉదయం రాజ్కోట్, ముంబై ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లను తీసుకెళ్లింది. సాయంత్రం విమానంలో బెంగళూరు, చెన్నై క్రికెటర్లు వెళ్తారు. చివరికి ధోనీ.. రాంచీకి చేరుకుంటాడు. ఇక ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ సైతం భారత క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాలే ఏర్పాటు చేశాయి. రాజస్థాన్, కోల్కతా, హైదరాబాద్ మాత్రం వాణిజ్య విమానాల్లో పంపిస్తున్నాయి.
ఐపీఎల్ 2021లో భాగంగా ఉన్న 11 మంది ఇంగ్లండ్ క్రికెటర్లలో ఎనిమిది మంది లండన్కు చేరుకున్నారు. బట్లర్, మొయిన్ అలీ, సామ్ కరన్, టామ్ కరన్, వోక్స్, బెయిర్స్టో, జేసన్ రాయ్, స్యామ్ బిల్లింగ్స్ బుధవారం ఉదయమే హీత్రూ విమానాశ్రయానికి వచ్చారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. మరో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు మోర్గాన్, జోర్డాన్, మలాన్ రెండు రోజులు ఆలస్యంగా బయలుదేరుతారు. వీరంతా అక్కడి నిబంధనల ప్రకారం పది రోజుల పాటు గవర్నమెంట్ ఆమోదం పొందిన హోటల్లలో 10 రోజులు పాటు క్వారంటైన్లో ఉంటారు.
క్రికెటర్లు, కోచ్లు, అంపైర్లు, సపోర్ట్ స్టాఫ్తో సహా 38 మందితో కూడిన ఆస్ట్రేలియా బృందం భారత్ వీడటంపై మాత్రం స్పష్టత వచ్చేసింది. నేరుగా తమ దేశంలోనికి అనుమతి లేదని తెలుసు కాబట్టి ప్రత్యామ్నాయంగా వీరంతా మాల్దీవులను ఎంచుకున్నారు. ఆటగాళ్ల కోసం ప్రత్యేక సడలింపులు ఏమీ లేవు కాబట్టి రెండు వారాలు మాల్దీవులలో గడిపిన తర్వాతే స్వదేశానికి వెళతారు.