
మార్చి 2 నుంచి ప్రాక్టీస్:
చెన్నై సూపర్కింగ్స్ సీఈవో కేఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ మార్చి 2 నుంచి చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తాడు. అప్పటికి అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో కలిసి అతడు సాధన చేస్తాడు. ఇప్పటికే రైనా, రాయుడు గత మూడు వారాల నుంచి శిక్షణలో పాల్గొంటున్నారు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు, ధోనీ మధ్య ఒక అవగాహనకు వచ్చేందుకు ప్రాక్టీస్ సెషన్ ఉపయోగపడుతుంది. ఇక పూర్తిస్థాయి శిక్షణ శిబిరం మాత్రం 19 నుంచి మొదలవుతుంది. మొత్తం ఆటగాళ్లు అప్పుడు పాల్గొంటారు' అని తెలిపారు.

మధ్యలో విరామం:
చెన్నై జట్టు సీనియర్ క్రికెటర్లైన సురేశ్ రైనా, అంబటి రాయుడుతో కలిసి మహీ రెండు మూడు వారాలు సాధన చేస్తాడని సమాచారం తెలుస్తోంది. ఆ తర్వాత విరామం తీసుకుంటాడట. ఇక మార్చి 19 నుంచి మొదలయ్యే పూర్తిస్థాయి శిక్షణ శిబిరంలో 38 ఏళ్ల మహీ పాల్గొననున్నాడు. గతేడాది ప్రపంచకప్ సెమీస్లో న్యూజిలాండ్తో ఓటమి పాలైన తర్వాత మహీ మైదానంలో అడుగుపెట్టలేదు. గత నెలలో ఝార్ఖండ్ రంజీ జట్టుతో కలిసి ఓ వారం సాధన చేశాడు.

తొలి మ్యాచ్లో చెన్నై vs ముంబై:
మార్చి 29 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంఛైజీలన్నీ అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఇప్పటికే శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి. మార్చి 29న చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్తో ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభం కానుంది.

వేలంలో చావ్లాను తీసుకున్న చెన్నై:
గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో చెన్నై ఆచితూచి అడుగులేసింది. ఇప్పటికే పటిష్ట జట్టు ఉండడంతో స్టార్ ఆటగాళ్లను కనుగోలు చేయలేదు. పియూష్ చావ్లా, జోస్ హేజిల్వుడ్, శామ్ కరణ్, ఆర్ సాయి కిషోర్ను సొంతం చేసుకుంది. సీజన్-12 ఫైనల్లో కేవలం ఒక్క పరుగు తేడాతో చెన్నై ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎప్పటిలాగే ఈసారి కూడా టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.


Click it and Unblock the Notifications












