ఐపీఎల్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆర్సీబీతో సమానంగా 14 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్ రేటు తక్కువగా ఉండటంతో తదుపరి దశకు చేరుకోలేకపోయింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (54; 39 బంతుల్లో, 3X4, 3X6) అర్ధశతకం సాధిచాడు. అయితే బెంగళూరు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నై 200 పరుగులే చేయాలి. కాగా, ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో సీఎస్కే 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితమైంది.

రచిన్ రవీంద్ర (61; 37 బంతుల్లో, 5X4, 3X6) టాప్ స్కోరర్. ఆఖర్లో ఎంఎస్ ధోనీ (25; 13 బంతుల్లో, 3X4, 1X6) పోరాడారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లకు ధోనీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెనుదిరగడం చర్చనీయాంశమైంది. సంచలన ప్రదర్శనతో వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి ప్లేఆఫ్స్కు చేరిన బెంగళూరు ఆటగాళ్లు సీఎస్కేపై విజయానంతరం గెలుపు సంబరాల్లో మునిగి తేలారు.
మరోవైపు షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం కాసేపు ఎదురుచూసిన ధోనీ, ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. తనకు ఎదురుపడిన ఆర్సీబీ కోచింగ్ స్టాఫ్కు షేక్ హ్యాండ్ ఇచ్చి, డ్రెస్సింగ్ రూమ్కు ధోనీ వెళ్లిపోయాడు. అయితే ఆ తర్వాత ధోనీని వెతుక్కుంటూ విరాట్ కోహ్లి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లినట్లు నెట్టింట వీడియో చక్కర్లు కొడుతోంది.
అనంతరం ధోనీకి కోహ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు ముచ్చటించాడని సమాచారం. కాగా, ఫైనల్లో ఆర్సీబీ తప్పక విజయం సాధించి టైటిల్ అందుకోవాలని పేర్కొంటూ కోహ్లికి ధోనీ ఆల్ ది బెస్ట్ చెప్పాడని తెలుస్తోంది. 'నువ్వు ఫైనల్కు చేరాలి. అంతిమ పోరులో విజయం సాధించాలి' అని కోహ్లితో ధోనీ అన్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీ బుధవారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది.