టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ అతడి క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ప్రస్తుత తరంలోనూ అతడు బ్యాట్ పట్టకపోయినా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ తో సమానంగా మహీ పేరు మార్మోగిపోతుంటుంది. అయితే సాధారణంగా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన చాలా మంది క్రికెటర్లు.. రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తుంటారు. గంభీర్, మనోజ్ తివారీ, మహ్మద్ కైఫ్, మహ్మద్ అజారుద్దీన్, అంబటి రాయుడు.. ఇలా చాలా మంది ఆటగాళ్లు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినవారే.
ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా.. ధోనీ రాజకీయాల్లోకి వెళ్లాలని సూచించారు. కానీ మహీ మాత్రం అలా కాకుండా సింపుల్ లైఫ్ గుడుపుతూ.. తనకిష్టమైన క్రికెట్ (ఐపీఎల్) ను కొనసాగిస్తూ.. వ్యాపారాల్లో మాత్రమే కెరీర్ లో ముందుకెళ్తోన్నాడు. అయితే తాజాగా మహీ రాజకీయాల్లోకి వెళ్లే విషయమై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడారు. ధోనీ రాజకీయాల్లోకి వస్తే మంచి రాజకీయ నాయకుడు అవుతాడని పేర్కొన్నారు.

"నాకు తెలిసి రాజకీయాల్లో ధోనీకి మంచి భవిష్యత్ ఉంటుంది. అతడి పొలిటీషియన్ గా రాణించగలిగే సామర్థ్యం ఉంది. కానీ రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది పూర్తిగా అతడి నిర్ణయం. సౌరవ్, నేను.. మహీ బెంగాల్ రాజకీయాల్లోకి వెళ్తాడని భావించాం. అతడు సులభంగా గెలవగలడు. ఎందుకంటే అతడు అంత పాపులర్." అని శుక్లా వెల్లడించారు.
ధోనీతో ఓ సారి పాలిటిక్స్ గురించి మాట్లాడినట్లు గుర్తుచేసుకున్నారు రాజీవ్ శుక్లా. "ధోనీ లోక్ సభ ఎన్నికల్లో పాల్గొంటున్నాడని రూమర్ వినిపించింది. అది నిజం అనుకొని మహీతో దీని గురించి చర్చించాను. అప్పుడు అతడు కాదని వివరించాడు. నిజానికి ధోనీ ఎక్కువగా బయట కనపడటానికి ఇష్టపడడు. ఫేమ్ కు దూరంగా సైలెంట్ ఉండే స్వభావం అతడిది. కనీసం అతడి దగ్గర మొబైల్ ఫోన్ కూడా ఉండదు. కనీసం బీసీసీఐ సెలక్టర్లు కూడా అతడిని సంప్రదించాలన్నా కూడా కుదరదు. కేవలం తాను చేసే పనిపై మాత్రమే శ్రద్ధ వహిస్తాడు. దాన్ని సీరియస్ గా చేస్తుంటాడు." అని శుక్లా పేర్కొన్నారు.