చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ భారత్ తరపున మళ్లీ క్రికెట్ ఆడతాడా? లేదా? అని సగటు భారత క్రికెట్ అభిమాని మనసులో మెదులుతున్న ప్రశ్న. 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమి తరువాత ధోనీ మళ్లీ బ్యాట్ పట్టింది లేదు. దాంతో కొన్ని నెలల క్రితం బీసీసీఐ ప్లేయర్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి కూడా ధోనీని తొలగించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020తో పునరాగమనం చేద్దామనుకున్న ధోనీకి కరోనా వైరస్ ఆశాభంగం కలిగించింది. లాక్డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ 13వ సీజన్పై స్పష్టత రావడంతో.. అందరి కళ్లూ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీపై పడ్డాయి.
యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని జట్టు ఆగస్టు మూడో వారంలో యూఏఈ పయనం కానున్నాయి. అయితే ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం మరో వారం ముందే యూఏఈలో అడుగుపెట్టనుంది. ఆగస్టు రెండో వారంలోనే యూఏఈ చేరుకునేందుకు చెన్నై ప్రాంచైజీ సన్నాహాలు చేస్తోందని సమాచారం తెలుస్తోంది. మిగతా ఫ్రాంచైజీలు ఆగస్టు మూడో వారంలో యూఏఈలో కాలుమోపనున్నాయి.
కరోనా వైరస్ మహమ్మారి వల్ల నాలుగు నెలలుగా ఇళ్లకే పరిమితమైపోవడంతో కొంత ప్రాక్టీస్ అవసరమవుతుందనే ఉద్దేశంతోనే ముందుగా చెన్నై జట్టు యూఏఈ వెళుతున్నట్లు సమాచారం. ముందుగా వెళ్లడం వల్ల మిగతా జట్ల కంటే ముందుగా ప్రాక్టీస్ ప్రారంభించడమే కాకుండా.. అక్కడి వాతావరణానికి కూడా అలవాటు పడవచ్చని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎంఎస్ ధోనీకి ఎక్కువ ప్రాక్టీస్ లభించనుంది.
ఎంఎస్ ధోనీ గత మార్చిలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన శిక్షణా శిబిరంలో సాధన చేశాడు. ప్రాక్టీస్ సమయంలో భారీ సిక్సర్లు కూడా బాదాడు. మహీని చూడడానికి చిదంబరం మైదానంకు భారీ స్థాయిలో అభిమానులు క్యూ కట్టారు. ఆపై వైరస్ కారణంగా రాంచికి వెళ్ళిపోయాడు. చెన్నైలో మహీ ఎంతో కష్టపడ్డాడని తోటి ఆటగాళ్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. అంతర్జాతీయ కెరీర్లో ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు 90 టెస్టుల్లో, 350 వన్డేల్లో, 98 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 4876, వన్డేల్లో 10773, టీ20ల్లో 1617 రన్స్ చేశాడు.
ఇదిలా ఉంటే గత ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ను తృటిలో చేజార్చుకుంది. ఒక్క పరుగు తేడాతో ఓడింది. ఈసారైనా కచ్చితంగా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. చాలారోజులుగా క్రికెట్కు దూరమైన మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ సీజన్లో సత్తాచాటి తిరిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని పట్టుదలగా ఉన్నాడు.
'ప్యాడ్లు కట్టుకొని సిద్ధంగా ఉండి.. మూడు నిమిషాలు దాటినా సచిన్ మైదానంలోకి రాలేదు'