హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సూచించిన చిట్కాల వల్లే తాను హిట్టింగ్ చేయగలుగుతున్నానని ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వెల్లడించాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా ఆడుతున్న మూడో మ్యాచ్లోనే సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
పల్లెకెలె వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా 86 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి వేగంగా సెంచరీ చేసిన భారత టెస్టు క్రికెటర్గా పాండ్యా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ అనంతరం పాండ్యా మీడియాతో మాట్లాడాడు.

'నా కెరీర్లో తొలిసారి సెంచరీ మైలురాయిని అందుకున్నాను. గతంలో 90 స్కోరు దాటిన సందర్భాలు లేవనే చెప్పాలేమో. నేనెప్పుడూ నా వ్యక్తిగత స్కోరుని పట్టించుకోను. ఇక్కడే నేను ధోనీ దగ్గర నుంచి నేర్చుకున్న కొన్ని చిట్కాలను చెప్పాలి. జట్టు స్కోరు బోర్డును చూసి దానికి తగినట్లు హిట్టింగ్ చేయాలి. ఆ బ్యాటింగ్తో జట్టును మెరుగైన స్థితికి తీసుకెళ్లాలని ధోని చెప్పాడు. ఇదే సూత్రాన్ని నేను ఫాలో అవుతున్నా' అని పాండ్యా వెల్లడించాడు.
తనకు వ్యక్తిగత రికార్డులు, మైలురాళ్లు అవసరం లేదని, జట్టు ప్రయోజనాలనే ముఖ్యమని చెప్పాడు. 'నా దృష్టంతా గేమ్ పైనే. ఎలా ఆడాలనేది మాత్రమే నా ప్రణాళికలో ఉంటుంది. జట్టు కోసం ఏమి చేయగలను అనేది మాత్రమే ఆలోచిస్తా. భారత మాజీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సాధించిన దానిలో కనీసం 10 శాతం సాధించినా చాలు. అదే నా జీవితంలో చాలా సంతోషాల్ని తీసుకొస్తుంది' అని పాండ్యా అన్నాడు.
కాగా, ఒకవైపు వికెట్లు పడుతున్నా స్పిన్నర్ పుష్పకుమార బౌలింగ్లో వరుసగా 4, 4, 6, 6, 6 బాది పాండ్యా ఔరా అనిపించాడు. తద్వారా ఒకే ఓవర్ లో 26 పరుగుల్ని పిండుకుని తన ఖాతాలో ఓ రికార్డుని వేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగుల్ని సాధించిన భారత క్రికెటర్గా గుర్తింపు సాధించాడు.