
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్కూలు విద్యార్దులతో సరదాగా గడిపాడు. భారత ఆర్మీ లెఫ్ట్నెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని బుధవారం శ్రీనగర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ని సందర్శించాడు. ఈ సందర్భంగా స్కూలు విద్యార్ధులతో ధోని ముచ్చటించాడు.
ధోనిని ఆర్మీ యూనిఫామ్లో చూసిన చిన్నారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చినార్ కార్ప్స్ తన ట్విటర్ ద్వారా పంచుకుంది. 'లెఫ్ట్నెంట్ కల్నల్ ధోని విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చదువు, క్రీడల యొక్క ప్రాముఖ్యతను వివరించాడు' అని ట్వీట్లో పేర్కొంది.
విద్యార్థులతో ముచ్చటించిన ధోని ఆ తర్వాత వారితో కలిసి ఫొటోలు దిగాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య ప్రస్తుతం టెస్టు సిరిస్ జరుగుతున్న నేపథ్యంలో విరామం దొరకడంతో ధోని తన ఖాళీ సమయాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాడు. ధోనికి కాశ్మీర్ అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం.
2012లో చివరగా ధోని కాశ్మీర్ వ్యాలీని సందర్శించాడు. అప్పట్లో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న జవాన్లను ధోని ప్రత్యేకంగా కలిసి వారితో ఫోటోలు దిగిన సంగతి తెలిసిందే. టెస్టు సిరిస్ అనంతరం భారత్-శ్రీలంక జట్ల మధ్య ప్రారంభం కానున్న వన్డే సిరీస్లో ధోని ఆడనున్నాడు.