|
మ్యాచ్ ఓడినా..అభిమానుల మనసులు గెలిచిన ధోనీ..!
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ధోనీ, కేదార్ జాదవ్ చివరికంటా క్రీజులో నిలిచారు. 32 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు ధోనీ. అయినప్పటికీ- భారీ షాట్లను ఆడలేకపోయారని అంటూ ధోనీ, కేదార్ జాదవ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై ఇప్పటిదాకా ధోనీ నోరు విప్పలేదు. టార్గెట్ను ఛేదించే దిశగా పోరాటం ప్రదర్శించలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో- ధోనీ వేలిని నోట్లు ఉంచుకుని ఉండటం, రక్తాన్ని ఉమ్మి వేస్తున్న ఫొటో ఒకటి వైరల్గా మారింది. వేలికి గాయమై, రక్తం కారుతున్నప్పటికీ.. ధోనీ పట్టించుకోలేదని, స్కోరును సాధించడంపైనే దృష్టి పెట్టారని అభిమానులు చెబుతున్నారు. అతని చిత్తశుద్ధిని శంకించలేమని అంటున్నారు.
|
బంగ్లాదేశ్పై చెలరేగాలని కోరుకుంటున్న అభిమానులు..
పాకిస్తాన్పై విజయం సాధించిన తరువాత టీమిండియా ఇప్పటిదాకా మూడు మ్యాచ్లను ఆడింది. ఈ మూడింట్లో కూడా మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్పై దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ధోనీ తన సహజ ధోరణికి భిన్నంగా ఆడుతున్నారని, మందకొడిగా బ్యాటింగ్ చేస్తున్నారని అంటూ టీమిండియా మాజీ కేప్టెన్ సచిన్ టెండుల్కర్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం విమర్శించారు. ప్రత్యేకించి- స్పిన్ బౌలింగ్లో రక్షణాత్మక ధోరణిని అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా కూడా అవే విమర్శలను ఎదుర్కొన్నారు ధోనీ. లక్ష్యంగా భారీగా ఉన్నప్పటికీ.. నింపాదిగా బ్యాటింగ్ చేశారని, భారీ భాగస్వామ్యాన్ని జోడించడంలో విఫలం అయ్యారనే ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా ధోనీ చెలరేగి ఆడాలని, తన సహజసిద్ధమైన ఆటతీరును ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
|
ధోనీని వీడని తడబాటు..
టీమిండియా మేనేజ్మెంట్ను కలవరపెడుతోన్న అంశం మహేంద్ర సింగ్ ధోనీ స్ట్రైక్ రేట్. ప్రస్తుత ప్రపంచకప్లో భారత్ ఎదుర్కొన్న చివరి రెండు మ్యాచుల్లో ధోనీ.. తన సహజ శైలికి భిన్నంగా ఆడాడనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ధోనీ స్ట్రైక్ రేట్ సైతం దీన్నే సూచిస్తోంది. చీల్చి చెండాడాల్సిన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ను మహేంద్ర సింగ్ ధోనీ అతిగా గౌరవించాడని అంటున్నారు విమర్శకులు. ప్రత్యేకించి స్పిన్ బౌలింగ్లో మరీ మందకొడిగా పరుగులు చేశాడని సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీలు ఇప్పటికే విమర్శలు గుప్పించారు. ఆప్ఘనిస్తాన్ మ్యాచ్లో గానీ, వెస్టిండీస్తో మ్యాచ్లో గానీ ధోనీ తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది.
|
ధోనీ బ్యాట్ నుంచి కనిపించని మెరుపులు..
ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ధోనీ పూర్తిగా రక్షణాత్మక స్థితిలో బ్యాటింగ్ చేశాడనే విషయం అందరికీ తెలుసు. 52 బంతులను ఆడిన ధోనీ.. 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. భారీ షాట్ ఆడబోయి క్రీజును వదిలి ముందుకొచ్చాడు. స్టంప్ అవుట్ అయ్యాడు. ధోనీ స్టంప్ అవుట్ కావడం చాలా అరుదు. మొన్నటి వెస్టిండీస్తో మ్యాచ్లో కూడా ధోనీ స్టంప్ అవుట్ అయ్యేవాడే అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బంతిని మిస్ అయిన ధోనీ నాలుగైదు అడుగులు ముందుకెళ్లినప్పటికీ..వికెట్ కీపర్ షైహోప్ ఉదాసీనత వల్ల సురక్షితంగా క్రీజులోకి చేరుగలిగాడు. అప్పటికి ధోనీ చేసింది ఎనిమిది పరుగులే. ఆ స్టంపవుట్ను షై హోప్ మిస్ కాకుండా ఉండి ఉంటే ధోనీ అవుటైన తీరుపై మరోసారి పెద్ద చర్చే జరిగి ఉండేది.