హైదరాబాద్: దటీజ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) పద్దతిని ధోని ఉపయోగించినంతగా మరే ఇతర కెప్టెన్ ఉపయోగించలేదనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో ఇదే రుజువైంది.
భారత-శ్రీలంక జట్ల మధ్య ప్రేమదాస స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో డీఆర్ఎస్ ద్వారానే డిక్వెల్లా అవుటయ్యాడు. డిక్వెల్లా అవుటవ్వడానికి ప్రధాన కారణం సరైన సమయంలో వికెట్ కీపర్ ధోని సమయస్ఫూర్తితో వ్యవహరించడమే. దీంతో డీఆర్ఎస్ అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్' అంటూ సోషల్ మీడియాలో ధోని పేరు ట్రెండింగ్ అవుతుంది.

అసలేం జరిగందంటే..
ఐదు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం కొలంబో వేదికగా నాలుగో వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లీసేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 375 పరుగులు చేసింది. అనంతరం 376 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 22 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది.
వన్డే అరంగేట్రం పేసర్ శార్దూల్ ఠాకూర్ వేసిన బంతిని ఎదుర్కొన్న ఓపెనర్ డిక్వెల్లా కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చాడు. క్యాచ్ అందుకున్న ధోని అవుట్ అంటూ అప్పీల్ చేయగా మైదానంలో ఉన్న అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. దీంతో వెంటనే ధోని డీఆర్ఎస్కి వెళ్లమని కెప్టెన్ కోహ్లీకి సూచించాడు.

ధోని తీసుకున్న సడన్ నిర్ణయంతో కోహ్లీ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. కానీ, ధోని మీదు ఉన్న నమ్మకంతో డీఆర్ఎస్ని ఆశ్రయించాడు. దీంతో డీఆర్ఎస్లో డిక్వెల్లా అవుటని తేలింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
దీంతో అభిమానులు 'డీఆర్ఎస్ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్', 'డీఆర్ఎస్లో నువ్వు బాస్ అని మరోసారి రుజువైంది' అంటూ ధోనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డీఆర్ఎస్ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్గా పేరు మార్చాలని ఓ అభిమాని ఐసీసీకి ఈ సందర్భంలో సూచించడం విశేషం.
ఇదిలా ఉంటే నాలుగో వన్డేలో ఆతిథ్య శ్రీలంకపై కోహ్లీసేన 168 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్వదేశంలో శ్రీలంక ఇంతటి భారీ పరుగుల తేడాతో ఓటమి పాలవ్వడం ఇదే తొలిసారి. ఇక ఈ వన్డేకి ఓ ప్రత్యేకత కూడా ఉంది. ధోనికి ఇది 300వ వన్డే. తన కెరీర్లో 300వ వన్డే ఆడిన ధోని ఈ మ్యాచ్లో 49 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.