చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. గత నాలుగు మ్యాచ్ల్లో చెన్నైకి ఇది మూడో ఓటమి కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62; 48 బంతుల్లో; 5x4, 2x6) టాప్ స్కోరర్.
పంజాబ్ స్పిన్నర్లు రాహుల్ చాహర్ (2/16), హర్ప్రీత్ బ్రార్ (2/17) చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. రొసో (43; 23 బంతుల్లో, 5x4, 2x6), బెయిర్స్టో (46; 30 బంతుల్లో, 7x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో శార్దూల్, గ్లీసన్, దూబె తలో వికెట్ తీశారు.

అయితే సీఎస్కే ఇన్నింగ్స్లో ఎంఎస్ ధోనీ వ్యవహరించిన తీరు తీవ్రచర్చకు దారి తీసింది. స్టార్ క్రికెటర్ డారిల్ మిచెల్ను ధోనీ అవమానించాడని నెట్టింట విమర్శలు వస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. 11 బంతులు ఎదుర్కొన్న ధోనీ 15 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటయ్యాడు. అయితే అర్షదీప్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్లో అన్ని బంతుల్ని ధోనీనే ఎదుర్కొన్నాడు. సింగిల్కు అవకాశం వచ్చినా ప్రయత్నించలేదు.
మూడో బంతికి ధోనీ డీప్ కవర్ మీదుగా షాట్ ఆడాడు. దీంతో మరో ఎండ్లో ఉన్న డారిల్ మిచెల్ సింగిల్ కోసం అవతల క్రీజు వరకు వచ్చాడు. కానీ ధోనీ సింగిల్కు నిరాకరించాడు. వెంటనే మిచెల్ తిరిగి నాన్స్ట్రైకింగ్కు పరుగు తీశాడు. ఫీల్డర్ బంతిని త్రో వేసే సమయంలోపే మిచెల్ రెండు పరుగులు పూర్తి చేసినా, ధోనీ సింగిల్కు రాకపోవడం గమనార్హం. ఆ తర్వాత నాలుగో బంతికి పరుగులేమి చేయని ధోనీ అయిదో బంతికి సిక్సర్ బాదాడు.
దీనిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ''ఎంఎస్ ధోనీకి అభిమానులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, కచ్చితంగా సిక్సర్ గురించి మాట్లాడతారు. అతన్ని ప్రజలు ఎంతో ప్రేమిస్తారు. అతను ఆడిన ఇన్నింగ్స్ను చూస్తే తన నుంచి మరిన్ని ఆశించాలనిపిస్తుంది. అయితే ధోనీ సింగిల్కు నిరాకరించాల్సింది కాదు. ఇది టీమ్ గేమ్. జట్టు ఆటలో అలా చేయకూడదు. మరో ఎండ్లో ఉన్న వ్యక్తి అంతర్జాతీయ క్రికెటర్. అతను బౌలర్ అయితే, ఫర్వాలేదనకుకోవచ్చు. జడేజా, మిచెల్తో ధోనీ ఇలా చేశాడు. అలా చేయాల్సిన అవసరం లేదు'' పఠాన్ అన్నాడు.