ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు స్టేడియంలో అడుగుపెడతాడా అంటూ కోట్లాది మంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఎంఎస్ ధోనీ తన రీఎంట్రీపై జట్టు యాజమాన్యానికి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తాను పూర్తిగా ఫిట్నెస్ సాధించినప్పటికీ.. కేవలం తనను జట్టులోకి తీసుకోవడం కోసం ప్రస్తుతం బాగున్న జట్టు కాంబినేషన్ను పాడు చేయవద్దని ధోనీ జట్టు యాజమాన్యానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. టీమ్ సమతుల్యత దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గాయం కారణంగా దూరం
గత కొద్ది రోజులుగా ఎంఎస్ ధోనీ పిక్క గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన గత మ్యాచ్లోనే ధోనీ బరిలోకి దిగుతాడని అందరూ భావించినప్పటికీ.. ధోనీ బెంచ్కే పరిమితమయ్యాడు. ఆ మ్యాచ్లో చెన్నై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ మాట్లాడుతూ.. "ధోనీ బ్యాటింగ్ నైపుణ్యం గురించి మాకు సందేహం లేదు. కానీ వికెట్ల మధ్య ఆయన పిక్క గాయం ఇబ్బంది పెట్టకూడదు. తన గాయంపై తనకే నమ్మకం కలిగే వరకు వేచి చూడటం మంచిది" అని పేర్కొన్నారు.

మరోవైపు ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరగనున్న మ్యాచ్లో కూడా ధోనీ ఆడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధోనీ రికవరీపై సానుకూలంగా స్పందిస్తూ.. "ధోనీ కోలుకుంటున్నాడు, ఆయన చేయాల్సిన ప్రాక్టీస్ అంతా చేస్తున్నాడు" అని తెలిపాడు. అయితే జట్టులో ప్రస్తుతం ఉన్న యువ ఆటగాళ్ల స్థానాన్ని చెడగొట్టి తాను ప్లేయింగ్ ఎలెవన్లోకి రావడానికి ధోనీ ఇష్టపడటం లేదని ఓ నివేదిక వెల్లడించింది. ఏ యువ ఆటగాడి అవకాశాన్ని తాను అడ్డుకోవద్దని ధోనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సీఎస్కే పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఆడిన 7 మ్యాచ్ల్లో మూడు విజయాలు, 4 ఓటములతో ఆరు పాయింట్లు సాధించింది. జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే ప్రతి మ్యాచ్ కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండటం అవసరమే అయినప్పటికీ.. ధోనీ తీసుకున్న ఈ నిర్ణయం అతని క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధోనీ రీఎంట్రీపై ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.