హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆదివారం వెస్టిండిస్తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డు సాధించాడు. విండిస్తో జరిగిన నాలుగో వన్డే వికెట్ కీపర్గా ధోనికి 295వ వన్డే.
తద్వారా వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్లకు వికెట్కీపర్గా సేవలు అందించిన రెండో ఆటగాడిగా ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర అత్యధికంగా 360 వన్డే మ్యాచ్లకు వికెట్కీపర్గా సేవలందించి అగ్రస్థానంలో నిలిచాడు.

సంగక్కర తర్వాత ధోని 295, దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ 294, ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్ క్రిస్ట్ 287, పాకిస్థాన్కు చెందిన మొయిన్ ఖాన్ 211లు ఉన్నారు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మట్లలో వికెట్ కీపర్గా సేవలందించిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ మూడో స్థానంలో నిలిచాడు.
466 మ్యాచ్లతో దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ అగ్రస్ధానంలో ఉండగా, ఆ తర్వాతి కుమార సంగక్కర(శ్రీలంక, 464), ధోని(భారత్, 461), అడమ్ గిల్క్రిస్ట్(ఆస్ట్రేలియా, 391), ఇయాన్ హేలీ(ఆస్ట్రేలియా, 287) తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇటీవలే వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్గా ధోని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
వెస్టిండిస్తో జరిగిన మూడో వన్డేలో ధోని ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో రెండు సిక్సర్లు బాదిన ధోని వన్డేల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా ధోని (వన్డే, టెస్టు, టీ20)లో 322 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది 476 సిక్స్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాత క్రిస్గేల్ (434), బ్రెండన్ మెకల్లమ్ (398), సనత్ జయసూర్య (352) సిక్స్లతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధికంగా సెహ్వాగ్, టీ20ల్లో అత్యధికంగా యువరాజ్, వన్డేల్లో అత్యధికంగా ధోనీ సిక్స్లు బాదారు.