బలహీనతలు అంగీకరించే పరిస్థితి లేదు
భారత మాజీ ఆటగాడు ఎస్. బద్రీనాథ్, శరవణ కుమార్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎంఫోర్ స్వచ్ఛంద సంస్థ సమావేశంలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, ఆర్ అశ్విన్ తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ... 'దేశంలో ఇప్పటికీ తమ మానసిక బలహీనతలను అంగీకరించని పరిస్థితి ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే.. మనలో చాాలామంది వాటిని మానసిక ఆరోగ్య సమస్యలుగా భావిస్తాం' అని అన్నాడు.
క్రీజులోకి వెళ్ళగానే గుండెవేగం పెరుగుతుంది
'నిజంగా.. ఎలాంటి విషయాలు ఎవరూ చెప్పరు. కానీ నేను చెపుతున్నా. నేను బ్యాటింగ్ చేసేందుకు వెళ్లి 5-10 బంతులు ఎదుర్కొనేంత వరకు నా గుండె వేగం అమాంతం పెరుగుతుంది. ఎంతో ఒత్తిడిగా అనిపిస్తుంది. మరోవైపు భయమూ వేస్తుంది. ఎందుకంటే.. అందరికీ ఇదే అనుభూతి ఉంటుంది.ఇన్ని మ్యాచులు ఆడినా.. దాన్నెలా ఎదుర్కోవడమో ఇప్పటికీ తెలియట్లేదు' అని టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ పేర్కొన్నాడు.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగపరిచే కోచ్ కావాలి
'ఇది చాలా చిన్న సమస్యే. కానీ చాలాసార్లు కోచ్తో పంచుకొనేందుకు మొహమాటపడతాం. అందుకే క్రీడల్లో ఆటగాడు, కోచ్కీ మధ్య అనుబంధం చాలా కీలకం. కనీసం 15 రోజులకు ఒక్కసారైనా మెంటల్ కండిషనింగ్ కోచ్ జట్టుతో కలవాలి. అప్పుడు ఆటగాళ్లు ఏవైనా సమస్యలు ఉంటే.. ఆయనతో పంచుకోవచ్చు. ఆటగాడితో ఆయన నిరంతరం మాట్లాడుతుంటే.. ఆటలో ఎక్కడ అతడు ప్రభావం చెందుతున్నాడో అర్థమవుతుంది' అని మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. క్రీడల్లో ప్రతి జట్టుకు మానసిక ఆరోగ్యాన్ని మెరుగపరిచే కోచ్ అవసరమన్నాడు.
మానసిక స్పష్టత జీవితంలోనూ ఎంతో ముఖ్యం
మానసిక నైపుణ్యాలు పెంచుకొనే శిక్షణ ద్వారా ఆటగాళ్లు క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించవచ్చో విరాట్ కోహ్లీ వివరించాడు. 'మానసిక ఆరోగ్యం, మానసిక స్పష్టత క్రీడల్లోనే కాదు.. జీవితంలోనూ ఎంతో ముఖ్యం. క్రికెటర్లు తమను తాము అర్థం చేసుకొనేందుకు, మైదానంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని రాణించేందుకు బద్రీనాథ్, ఎంఫోర్ ఎంతో సాయం చేస్తున్నాయి. వారి సేవలకు ధన్యవాదాలు' అని కోహ్లీ తెలిపాడు.