ఫిబ్రవరి 8న బీబీఎల్ ఫైనల్ మ్యాచ్
ఫిబ్రవరి 8న జరిగే బిగ్బాష్ లీగ్ (బీబీఎల్) ఫైనల్ మ్యాచ్కు ముందు ఆల్ స్టార్ టి20 మ్యాచ్ కర్టెన్ రైజర్గా ఆడనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఆదివారం అధికారిక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా నుండి మాత్రమే కాకుండా, భారతదేశం సహా ఇతర దేశాల నుండి కూడా దిగ్గజ ఆటగాళ్ళు ఈ ఛారిటీ గేమ్లో పాల్గొంటారని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.
ఛారిటీ మ్యాచ్లో ధోని, సచిన్
భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, ధోనిలు ఈ ఛారిటీ మ్యాచ్లో ఆడనున్నట్లు తెలిపింది. ఈ మ్యాచ్లో పాల్గొనే ఇరు జట్లకు షేన్ వార్న్, రికీ పాంటింగ్లు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. బ్రెట్ లీ, జస్టిన్ లాంగర్, మైకేల్ క్లార్క్, ఆడమ్ గిల్ క్రిస్ట్, షేన్ వాట్సన్, అలెక్స్ బ్లాక్వెల్ లాంటి మాజీ దిగ్గజాలు ఈ మ్యాచ్లో ఆడనున్నారు.
నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీలో స్టీవ్ వా-మెల్ జోన్స్
మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా... ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రీడాకారిణి మెల్ జోన్స్ కూడా నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీలో పాల్గొంటారు. అదే రోజు మెల్బోర్న్ వేదికగా జంక్షన్ ఓవల్ స్టేడియంలో భారత-ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య అంతర్జాతీయ టీ20 జరగనుంది. ఈ మూడు మ్యాచ్ల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ రికవరీ ఫండ్కు అందజేయనున్నారు.
ప్రకృతి వైపరీత్యాల బాధితుల కోసం
అయితే, ఈ ఛారిటీ మ్యాచ్లో ధోని, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ దిగ్గజాలు ఈ మ్యాచ్లో ఆడాలని నిర్ణయించుకోవడం అభిమానులను పెద్ద ఆశ్చర్యానికి గురి చేయడం లేదు. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల బాధితుల కోసం డబ్బును సేకరించడానికి గతంలో అనేక ఛారిటీ మ్యాచ్లను ఆడటం జరిగింది.
2005 సునామీ సమయంలో కూడా
2005లో సునామి బారిన పడిన వారికి సహాయం చేసేందుకు గాను వరల్డ్ XI vs ఆసియా XI జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి మ్యాచ్లో రికీ పాంటింగ్, షేన్ వార్న్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, ముత్తయ్య మురళీధరన్ వంటి దిగ్గజ క్రికెటర్లు ఆడారు.