హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీసేన వెస్టిండిస్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. విండిస్ పర్యటనలో క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆంటిగ్వాలో జరిగే మూడో వన్డే కోసం టీమిండియా ఓపెన్ శిఖర్ ధావన్, మాజీ కెప్టెన్ ధోని కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో ఆంటిగ్వా బయల్దేరారు.
ధోనీ భార్య సాక్షి, కుమార్తె జీవాతో పాటు, ధావన్ భార్య, కుమారుడు జోరావర్ ఈ బస్సులోనే ప్రయాణించారు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను శిఖర్ ధావన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'ఆంటిగ్వాకు వెళ్తున్నాం. చిన్నారులు ఆడలాడుతూ అందరి ముఖాల్లో నవ్వులు తెప్పించారు' అనే క్యాప్షన్ కూడా పెట్టాడు.

వెస్టిండిస్ పర్యటనలో ధావన్ కుమారుడు జోరావర్, ధోని కుమార్తె జీవాలు తమ క్యూట్ నెస్తో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఆంటిగ్వాలోని ఓ బీచ్లో ఆడుకుంటుండగా తీసిన ఓ ఫోటోని ధోని భార్య సాక్షి ఇనిస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఈ ఫోటోలో బీచ్లో ఉన్న ఇసుకతో చిన్నారులిద్దరూ ఆడుకుంటూ కనిపించారు. వెస్టిండిస్ పర్యనటలో టీమిండియా ఆటగాళ్లు కూడా ఎంతో సంతోషంగా ఉండటాన్ని మనం సాక్షి పోస్టు చేసిన ఫోటోల ద్వారా గమనించవచ్చు. ఇదిలా ఉంటే తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, ఆదివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండిస్పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
దీంతో ఐదు వన్డేల సిరిస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. జూన్ 30న ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. మూడో వన్డే కోసం టీమిండియా ఇప్పటికే ఆంటిగ్వాకు చేరుకుంది.