హైదరాబాద్: టీమిండియాకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్గా టీమిండియాను పదేళ్ల పాటు నడిపించిన ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. అయితే ధోని నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేసింది.
మహేంద్ర సింగ్ ధోని ఫోటో గ్యాలరీ
కెప్టెన్సీ బాధ్యతల నుంచి సడన్గా ధోని వైదొలగడంపై పలువురు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం స్పందించిన సంగతి తెలిసిందే. ధోని కెప్టెన్సీ వీడ్కోలుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 'పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించి కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన ధోనికి అభినందనలు. కెరీర్ తొలి నాళ్లలో దూకుడైన వ్యక్తిత్వం నుంచి కెప్టెన్ కూల్గా తీసుకున్న బాధ్యతాయుత నిర్ణయాల వరకు అతన్ని నిశితంగా గమనించాను. అతని విజయవంతమైన కెప్టెన్సీ రికార్డును అభినందిస్తూ వీడ్కోలు నిర్ణయాన్ని గౌరవిద్దాం' అని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ 'టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలు భారత్కు అందించిన గొప్ప కెప్టెన్ ధోనీ. అతని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా' అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ధోని భార్య సాక్షి సింగ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గత పదేళ్లుగా టీమిండియా విజయపథంలో నడిపిన ధోని ఇక అధిరోహించే శిఖరాలు ఏమీ లేవంటూ ప్రత్యేకమైన మెసేజ్తో ట్విట్టర్లో ట్వీట్ని పోస్టు చేసింది. 'ధోని ఎక్కే పర్వతాలు ఏమీ లేవు. అందుచేత అతన్నే ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ధోని నిర్ణయాలు తీసుకునే ముందు చాలా ఆలోచించే తీసుకుంటాడు. నా భర్త ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్టుగానే ఉంటుంది' అని సాక్షి ట్వీట్ చేసింది.
కాగా, వన్డే, టి20 జట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం మహేంద్ర సింగ్ ధోని ప్రకటించాడు. ఈ మేరకు ధోని సమాచారం అందించాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ధోని చెప్పినట్టు బీసీసీఐ ట్విట్టర్లో తెలిపింది. దీంతో ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్కు ధోని వికెట్ కీపర్, బ్యాట్స్మన్గా అందుబాటులో ఉంటాడు.