రాంచీ: ఈ వేసవి కాలంలో దేశంలోని పలుచోట్ల నీటి కష్టాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మహారాష్ట్రలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న లాతూర్ ప్రాంతానికి కేంద్రం నీటితో కూడిన రైలును పంపిస్తోన్న విషయం తెలిసిందే.
నీటి ఎద్దటి కారణంగా మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచులు ఆడొద్దని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. మహారాష్ట్రలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీంతో ఏప్రిల్ నెలాఖరు వరకు రాష్ట్రంలో మ్యాచులు ఆడవచ్చునని, మే నెలలో మాత్రం ఇక్కడ ఆడవద్దని హైకోర్టు ఆదేశించింది. ఐపీఎల్ మ్యాచులకు లక్షలాది లీటర్ల నీటిని వాడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదే సమయంలో ఎంఎస్ ధోనీకి చెందిన రాంచీలోని స్విమ్మింగ్ పూల్ పైన కూడా ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సమాచారం మేరకు... ధోనీ రాంచీలోని తన స్విమ్మింగ్ పూల్ను నింపుకునేందుకు ప్రతి రోజూ పదిహేను వేల లీటర్ల నీటిని వాడుతున్నారని సదరు వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

దీని వల్ల స్థానిక ప్రజలు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అతను పేర్కొన్నాడు. తమకు నాలుగు బోర్ వెల్స్ ఉన్నాయని, కానీ అవి పని చేయడం లేదని సదరు వ్యక్తి చెప్పాడు. అదే సమయంలో తమ ఇంటి పక్కనే ఉన్న ధోనీ నివాసం మాత్రం వేలాది లీటర్ల నీటిని వృథా చేస్తోందని పేర్కొన్నాడు.
అధికారులు దీని పైన దృష్టి సారించాలని చెప్పాడు. ఈ విషయాన్ని అతను రాష్ట్ర మంత్రి అమర్ బౌరీ దృష్టికి తీసుకు వెళ్లాడని తెలుస్తోంది. చర్యలు తీసుకుంటామని మంత్రి నుంచి హామీ కూడా లభించిందని తెలుస్తోంది. మరికొందరు స్థానికులు కూడా ఫిర్యాదు చేసిన వ్యక్తికి వంత పాడుతున్నారని తెలుస్తోంది.
ఇక్కడ 5వేల మంది ఉంటారని, వారికి నీటి కష్టాలు తప్పడం లేదని, అదే సమయంలో ధోనీ నివాసం మాత్రం 15వేల లీటర్లు వాడుకుంటుందని ఆరోపిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో రాంచీలోని ధోనీ అడ్వైజర్ దీనిని కొట్టి పారేస్తున్నారు. ధోనీ కేవలం రాంచీకి వచ్చినప్పుడే స్విమ్మింగ్ పూల్ నింపుతామని, రోజూ నింపమని వివరణ ఇచ్చారు. కాగా, ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు రాజు అని తెలుస్తోంది.