అడిలైడ్: ఓ క్రికెట్ జట్టుకు ఎక్కువ కాలం ఓ వ్యక్తిని కెప్టెన్గా కొనసాగించడం మంచి పద్ధతి కాదని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు వన్డే, ట్వంటీ 20 కెప్టెన్గా ధోనీ సుదీర్ఘ కాలం బాధ్యతలు అప్పగించడంపై అతను స్పందించాడు.
పరిమిత ఓవర్ల సారధిగా ధోనీనే ఎక్కువ కాలం కొనసాగించడం వల్ల భారత క్రికెట్ జట్టు ప్రయోజనాలకు చేటు తెస్తుందని చెప్పాడు. ఒక విజయవంతమైన కెప్టెన్ ఉండటం మంచిదేనని, కానీ ఆ బాధ్యతను ఒకరి మీద ఎక్కువకాలం వదిలేయడం జట్టుకు హానీ చేస్తుందని అభిప్రాయపడ్డాడు.
విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకోవడమే అతనిని బయటకు పంపించేందుకు వ్యతిరేకత పని చేస్తోందన్నాడు. ప్రస్తుతం వ్యూహరచనలో భారత జట్టు బలహీనంగా ఉందని, కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తేనే విజయాలు సాధ్యమని చెప్పాడు.
ఆసిస్ గెలిచిన నాలుగు వన్డేలలో ప్రత్యర్థి జట్టు దాదాపు 1,300 పరుగులు సమర్పించుకుందని చెప్పాడు. ఆస్ట్రేలియాలోని ప్లాట్ పిచ్లలో టీమిండియా బౌలింగ్ ఆకట్టుకోలేదన్నాడు. విరాట్ కోహ్లీకి బాధ్యతలు అప్పగిస్తే మంచిదన్నాడు. ఇప్పటికే టెస్టు ఫార్మెట్లో కోహ్లీ నిరూపించుకున్నాడన్నాడు.