చెన్నై: చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2020 కోసం ఈసారి విభిన్నంగా సన్నద్ధమయ్యాడని టీమిండియా వెటరన్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా తెలిపాడు. ఎంఎస్ ధోనీ, అంబటి రాయుడు, మురళీ విజయ్, పీయూష్ చావ్లా తాను ఒక బృందంగా ఏర్పడి సాధన చేశామని రైనా చెప్పాడు. ఐపీఎల్ వాయిదాకి ముందు మార్చి మొదటి వారంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆటగాళ్ల కోసం ప్రాక్టీస్ సెషన్ ఏర్పాటు చేసింది యాజమాన్యం. రెండు వారాల పాటు సాగిన ఈ ప్రాక్టీస్లో అందరూ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ సాధన చేసారు.
బ్రదర్.. 40 ఏళ్లకు ఇగ ఏడాదే: కోహ్లీ
తాజాగా సురేశ్ రైనా మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ ఈసారి ప్రాక్టీస్ భిన్నంగా సాగింది. రాయుడు, మహీ భాయ్, మురళీ, నేనూ కలిసి ఒక సాధన చేశాం. చెన్నైలో ఉన్నప్పుడు ధోనీ 2-4 గంటలు సాధన చేసేవాడు. అయినప్పటికీ అతడు ఏమాత్రం అలసిపోలేదు. ధోనీ ఉదయం జిమ్లో కసరత్తులు చేసేవాడు. సాయంత్రం 3 గంటలు బ్యాటింగ్ సాధన చేసేవాడు. వరుసగా జిమ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ సాధన చేస్తే మరుసటి రోజు శరీరమంతా బిగుతుగా అవుతుంది. అప్పుడు మన శరీరం నెమ్మదిస్తుంది. మరింత కష్టపడాలి. మూడు గంటల శిక్షణ ఉంటే.. ఐదు గంటలు సాధన చేయాలి. అప్పుడే అలసట లేకుండా నాలుగు గంటలు మ్యాచ్ ఆడగలం' అని రైనా చెప్పాడు.
'టీమిండియా, చెన్నై సూపర్కింగ్స్ తరఫున మహీ భాయ్తో కలిసి ఆడాను. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు సాధన భిన్నంగా సాగింది. ఆయన ఎంత బాగా సన్నద్ధమయ్యారో తెలుసుకొనేందుకు ఐపీఎల్ టోర్నీ త్వరగా ఆరంభం కావాలని కోరుకుంటున్నా. శిక్షణ శిబిరంలో ప్రత్యక్షంగా నేనేం చూశానో అందరికీ తెలియాలని భావిస్తున్నా. ఎవరైనా కష్టపడి సాధన చేస్తే.. ప్రార్థనలు, ఆశీర్వాదాలు కూడా పనిచేస్తాయి' అని రైనా వెల్లడించాడు.
ఆస్ట్రేలియా వేదికగా వచ్చే అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని ఐసీసీ వాయిదా వేయాలని యోచిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించేందుకు సిద్ధంగా లేదు. దీంతో టోర్నీ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే అక్టోబరు-నవంబరు విండోలో ఐపీఎల్ 2020 సీజన్ని నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది.
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2018 తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు 10 నెలలు గడిచినా.. మహీ మైదానంలోకి దిగలేదు. తొలుత రెండు నెలల పాటు ధోనీ సెలవులో ఉంటాడని ప్రకటించినా.. ఆ తర్వాత కూడా అతను జట్టులో చేరలేదు. ఇక సెలక్షన్కు కూడా అందుబాటులో లేకపోవడంతో.. అతని బోర్డు కాంట్రాక్ట్ను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో రిటైర్మెంట్పై ఒత్తిడి నెలకొన్నా.. మహీ ఎలాంటి విషయం క్లారిటీ ఇవ్వలేదు. ఇక కరోనా కారణంగా మహీ భవిష్యత్ ప్రశ్నార్ధకంలో పడింది.