
హైదరాబాద్: సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే ధోనీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటోలో హోళీ సంబరాల్లో ఆడుకుంటున్న తన చిన్నారి రంగు పూసుకని ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఈ చిన్నారి ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదటిసారేం కాదు. ఈ మధ్య కృష్ణుడి పాటతో, ఆ తర్వాత పాఠశాల వార్షికోత్సవంలో తండ్రితో కలిసి పాల్గొన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
దేశ వ్యాప్తంగా శుక్రవారం హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ ప్రజలంతా వేడుకల్లో పాల్గొన్నారు. సఫారీ పర్యటన అనంతరం దొరికిన విశ్రాంతి కావడంతో భారత క్రికెటర్ ధోనీ కుటుంబసభ్యులు కూడా తమ నివాసంలో రంగులతో సరదాగా గడిపారు.
ఈ నేపథ్యంలో ధోనీ కుమార్తె జీవా హోలీ వేడుకల్లో పాల్గొన్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ముఖమంతా రంగులతో నవ్వులు చిందిస్తూ జీవా ఫొటోకు పోజిచ్చింది. శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు టీ20 టోర్నీ నుంచి బీసీసీఐ మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే.
దీంతో ధోనీ తన విలువైన సమయాన్ని కుటుంబసభ్యులతో గడుపుతున్నాడు. భవిష్యత్తులో ఉన్న విదేశీ పర్యటనలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక ఆటగాళ్లైన ధోనీ, కోహ్లీ, భువనేశ్వర్, బుమ్రా, పాండ్యాలను సైతం ముక్కోణపు టోర్నీ నుంచి దూరం చేసింది.